ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ముంబై రంజీ టీమ్ సీనియర్ ఆటగాళ్లతో ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ సరదాగా మాట్లాడాడు. ఈ సందర్భంగా బ్రాడ్కాస్టర్ కెమెరాలు రోహిత్ను చూపించే ప్రయత్నం చేయగా.. అతను ఫన్నీగా స్పందించాడు.
ఆడియో మ్యూట్లో పెట్టాలని కెమెరామెన్కు సూచించాడు. ఇప్పటికే ఓ ఆడియోతో తాను ఇబ్బందుల్లో పడ్డానని తెలిపాడు. 'భాయ్ కొంచెం ఆ ఆడియో మ్యూట్లో పెట్టు. ఇప్పటికే ఒక ఆడియోతో కష్టాల్లో పడ్డా'అని బదులిచ్చాడు. రోహిత్ శర్మ మాటలు స్పష్టంగా వినిపించాయి.

ఈ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్తో రోహిత్ శర్మ మాట్లాడిన మాటలు ప్రకంపనలు సృష్టించాయి. ముంబై ఇండియన్స్ టీమ్ పేరును ప్రస్తావించకుండా ఆ జట్టును ఉద్దేశించి రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'అన్నీ ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి.
ఇదంతా వాళ్లపై ఆధారపడి ఉంది. నేను ఏమీ పట్టించుకోవట్లేదు. ఏదేమైనా, అది నా ఇల్లు, నేను నిర్మించుకున్న దేవాలయం. మొత్తానికి ఇదే నా చివరిది'' అని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయిదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని ఈ సీజన్లో హార్దిక్ పాండ్యకు ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలను అందించిన విషయం తెలిసిందే.
ముంబై ఫ్రాంచైజీ తీసుకున్న ఈ కెప్టెన్సీ మార్పు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. సీజన్ ఆరంభంలో హార్దిక్ను రోహిత్ అభిమానులు హేళన చేశారు. ముంబై ఫ్రాంచైజీపై తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో ముంబై ఇండియన్స్ జట్టు రెండు గ్రూప్లుగా విడిపోయిందని వార్తలు వచ్చాయి.
కెప్టెన్సీ మార్పో లేక ఆటగాళ్ల మధ్య విభేదాలో తెలియదు కానీ ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. అందరి కన్నా ముందే ఇంటిదారి పట్టింది.