ఐపీఎల్ 2024 సీజన్ను ముంబై ఇండియన్స్ ఓటమితో ముగించింది. లక్నో సూపర్ జెయింట్స్తో వాంఖడే వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో చిత్తయ్యింది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(0), హార్దిక్ పాండ్యా(16) దారుణ వైఫల్యం ముంబై ఇండియన్స్ కొంపముంచింది.
ఈ ఇద్దరూ బాధ్యతాయుతంగా రాణించి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 55), నికోలస్ పూరన్(29 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 75) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.

ఆయుష్ బదోని(10 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 22 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లలో నువాన్ తుషారా(3/28), పియూష్ చావ్లా(3/29) మూడేసి వికెట్లు తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులకే పరిమితమైంది. ఇంపాక్ట్ ప్లేయర్ రోహిత్ శర్మ(38 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 68), నమన్ ధిర్(28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 62 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా, మోహ్సిన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
అదిరిపోయే ఆరంభం..
215 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్(23) దూకుడుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ముంబై ఇండియన్స్ 3.5 ఓవర్లలో 33 పరుగులు చేసిన అనంతరం ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ తిరిగిన ప్రారంభమైనా.. వర్షం కారణంగా దాదాపు 30 నిమిషాల పాటు ఆట ఆగిపోయింది.
రోహిత్ ధాటిగా ఆడటంతో ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు చేసింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అర్థ శతకం సాధించిన అనంతరం ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్.. ట్రేడ్ మార్క్ సిక్సర్లతో అలరించాడు.
దెబ్బతీసిన నవీన్ ఉల్ హక్..
ప్రమాదకరంగా మారిన ఈ జోడీని నవీన్ ఉల్ హక్ విడదీసాడు. డెవాల్డ్ బ్రెవిస్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 88 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే సూర్యకుమార్ యాదవ్(0)ను కృనాల్ పాండ్యా క్యాచ్ ఔట్ చేయగా.. ఆ మరుసటి ఓవర్లోనే రోహిత్ శర్మను రవి బిష్ణోయ్ పెవిలియన్ చేర్చాడు.
ఓ సిక్సర్, బౌండరీతో దూకుడు కనబర్చిన హార్దిక్ పాండ్యా(16)ను మోహ్సిన్ ఖాన్ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన నెహాల్ వధేరా కూడా రవి బిష్ణోయ్ బౌలింగ్లో వెనుదిరగడంతో 120 పరుగులకే ముంబై 5 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ఇషాన్ కిషన్(14), నమన్ ధిర్ దూకుడుగా ఆడారు. ముఖ్యంగా నమన్ ధిర్ విధ్వంసకర బ్యాటింగ్తో 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
నమన్ ధిర్ ఒంటరి పోరాటం..
అయితే ఆఖరి ఓవర్లో ముంబై విజయానికి 34 పరుగులు అవసరమవ్వగా.. నవీన్ ఉల్ హక్ బౌలింగ్లో నమన్ ధిర్ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదాడు. కానీ రెండో సిక్సర్ను బౌండరీ లైన్ వద్ద కృనాల్ పాండ్యా అద్భుతంగా అడ్డుకున్నాడు. దాంతో సిక్సర్ కాస్త సింగిల్గా మారిపోయింది.
మరుసటి బంతికే ఇషాన్ కిషన్ను క్లీన్ బౌల్డ్ చేసిన నవీన్ ఉల్ హక్..చివరి నాలుగు బంతుల్లో ఏడు పరుగులే ఇచ్చి లక్నో విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది.