ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ చివరి మ్యాచ్కు ఆ జట్టు స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్తో వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్కు ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ బుమ్రాను పక్కనపెట్టింది. అతని స్థానంలో సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తుది జట్టులోకి వచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2024 ముంగిట రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో బుమ్రాను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
అయితే ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు. ఐపీఎల్ కంటే టీ20 ప్రపంచకప్ కోసం రెస్ట్ ఇవ్వడం అద్భుతమని ప్రశంసిస్తుంటే మరికొందరు మాత్రం అసలు జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నిస్తున్నారు.

కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో ఉన్న గొడవల నేపథ్యంలోనే బుమ్రాను పక్కనపెట్టారని ఆరోపిస్తున్నారు. పర్పుల్ క్యాప్ రేసులో ముందు వరుసలో ఉన్న బుమ్రాను ఈ మ్యాచ్ ఆడించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 20 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడని, చివరి మ్యాచ్లో సంచలన ప్రదర్శన కనబర్చి 4-5 వికెట్లు తీసుంటే అగ్రస్థానంలో నిలిచే వాడని కామెంట్ చేస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ ముంగిట బుమ్రా హయ్యెట్ వికెట్ టేకర్గా నిలిచి ఉంటే అతని ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. హార్దిక్ పాండ్యానే బుమ్రాను పక్కనపెట్టాడని ఆరోపిస్తున్నారు. కొందరైతే సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కోసం జస్ప్రీత్ బుమ్రాకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకొందరు జస్ప్రీత్ బుమ్రాకు ఏమైనా గాయం అయిందా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా హ్యాష్ ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. ముఖ్యంగా బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన అర్జున్ టెండూల్కర్ నిప్పులు చెరిగాడు. రెండు ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తొలి ఓవర్లో మూడు పరుగులే ఇచ్చిన అతను మార్కస్ స్టోయినిస్ను ఔట్ చేసినంత పనిచేశాడు. కానీ అతను రివ్యూ తీసుకొని బచాయించాడు.