ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్కు కోల్కతా నైట్రైడర్స్ కో-ఓనర్, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హాజరయ్యే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
ఐపీఎల్ 2012 సీజన్లో వాంఖడే సెక్యూరిటీతో షారుఖ్ ఖాన్ గొడవపడ్డాడని ముంబై క్రికెట్ అసొసియేషన్ అతనిపై ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ఆ తర్వాత ఈ నిషేధాన్ని మూడేళ్లకు కుదించినా.. షారుఖ్ ఖాన్ మాత్రం అప్పటి నుంచి వాంఖడే మైదానంలో అడుగుపెట్టలేదు.

కనీసం ఈ సారైనా వస్తాడా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 12 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను అవమానంగా భావించిన షారుఖ్ ఖాన్.. అప్పటి నుంచి వాంఖడే స్టేడియానికి దూరంగా ఉంటున్నాడు.
ముంబై క్రికెట్ అసోసియేషన్ వివరాల ప్రకారం.. వాంఖండే స్టేడియం సెక్యూరిటీతో షారుఖ్ ఖాన్ అకారణంగా గొడవపడ్డాడని, మద్యం మత్తులో వారితో వాగ్వాదానికి దిగడంతో పాటు సెక్యూరిటీ నిబంధనలు అతిక్రమించాడనే కారణాలతో బాలీవుడ్ బాద్షాపై ఐదేళ్ల పాటు నిషేధం విధించారు.
అయితే ఈ ఘటనలో షారుఖ్ ఖాన్ తప్పేం లేదని, అప్పటి కేకేఆర్ టీమ్ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను కేకేఆర్ ఓడించడంతో సహించని కొందరు అభిమానులు.. షారుఖ్ ఖాన్ కూతుర్ని క్యాట్ అంటూ ఇన్సల్ట్ చేశారని తెలిపాడు. ఈ కామెంట్స్తో షారుఖ్ ఖాన్ ఆగ్రహానికి గురయ్యాడని, అతను మద్యం తాగలేదని పేర్కొన్నాడు.
తన తప్పిదం లేకున్నా నిషేధం విధించడంపై తీవ్ర మనస్థాపానికి గురైన షారుఖ్ ఖాన్.. వాంఖడే మైదానానికి రాకుండా తన నిరసనను తెలియజేస్తున్నాడు. తాజా మ్యాచ్కు అయినా హాజరై అన్ని మరిచిపోతాడా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.