ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అరంగేట్ర పేసర్ అశ్వని కుమార్(4/24) నిప్పులు చెరిగాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ 16.2 ఓవర్లలో 116 పరుగులకు కుప్పకూలింది. అంగ్క్రిష్ రఘువంశీ(16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 26), రమణ్దీప్ సింగ్(12 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
ముంబై బౌలర్లలో అశ్వని కుమార్తో పాటు దీపక్ చాహర్(2/19) రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, విజ్ఞేష్ పుతుర్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కేకేఆర్కు శుభారంభం దక్కలేదు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, అశ్వని కుమార్ చెలరేగడంతో పవర్ ప్లేలోనే కేకేఆర్ 4 వికెట్లు కోల్పోయింది. సునీల్ నరైన్(0) డకౌటవ్వగా.. డికాక్(1), రహానే(11), వెంకటేశ్ అయ్యర్(3) తీవ్రంగా నిరాశపరిచారు.
అంగ్క్రిష్ రఘు వంశీ, రింకూ సింగ్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా ముంబై బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. క్రీజులో సెట్ అయిన రఘువంశీని హార్దిక్ ఔట్ చేయగా.. రింకూ సింగ్ను అశ్వని కుమార్ పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే ఇంపాక్ట్ ప్లేయర్ మనీష్ పాండే(19)తో పాటు ఆండ్రీ రస్సెల్(5)ను క్లీన్ బౌల్డ్ ఔట్ చేసిన అశ్వని.. కేకేఆర్ పతనాన్ని శాసించాడు. హర్షిత్ రాణాను విజ్ఞేష్ పుతుర్ ఔట్ చేయగా.. రమణ్దీప్(22) సింగ్ను మిచెల్ సాంట్నర్ పెవిలియన్ చేర్చి కేకేఆర్ ఇన్నింగ్స్కు తెరదించాడు. అశ్వని కుమార్కు మరో ఓవర్ బౌలింగ్ ఇవ్వకుండా హార్దిక్ పాండ్యా.. అతని ఐదు వికెట్ల ఘనతను అడ్డుకున్నాడు.