ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహకారంతోనే అరంగేట్ర మ్యాచ్లో నాలుగు వికెట్లు ప్రదర్శన చేయగలిగానని ఆ జట్టు యువ పేసర్ అశ్వని కుమార్ తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో సోమవారం జరిగిన మ్యాచ్తో ఈ క్యాచ్ రిష్ లీగ్లోకి అడుగుపెట్టిన అశ్వని కుమార్.. ఫస్ట్ మ్యాచ్లోనే సంచలన ప్రదర్శన కనబర్చాడు.
తొలి బంతికే వికెట్ తీసిన అశ్వని కుమార్.. మొత్తం 3 ఓవర్లు బౌలింగ్ చేసి 24 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతని ధాటికి కెప్టెన్ అజింక్యా రహానేతో పాటు డేంజరస్ రింకూ సింగ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్ పెవిలియన్కు క్యూ కట్టారు. దాంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 116 పరుగులకే కుప్పకూలింది.

తొలి ఇన్నింగ్స్ అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన అశ్వని కుమార్.. తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. టీమ్ మేనేజ్మెంట్తో పాటు కెప్టెన్ సహకారంతోనే ఈ సంచలన ప్రదర్శన చేశానని చెప్పాడు. తన అరంగేట్రం నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నానని, భోజనం కూడా చేయలేదని తెలిపాడు. అరటి పండు మాత్రమే తిని ఈ మ్యాచ్ ఆడానని చెప్పాడు.
'చాలా సంతోషంగా ఉంది. అరంగేట్ర మ్యాచ్ కావడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాను. కానీ జట్టు వాతావరణం నా ఒత్తిడిని తగ్గించింది. ఈ రోజు నేను లంచ్ చేయలేదు. కేవలం అరటి పండు మాత్రమే తిన్నాను. తొలి మ్యాచ్ ఆడుతున్నాననే ఒత్తిడితో నాకు ఆకలి కూడా వేయలేదు. ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేసి ఫలితాన్ని రాబట్టాను.
'ఈ రోజు నీ అరంగేట్ర మ్యాచ్.. నీ నైపుణ్యాలను నమ్ముకొని ఆటను ఆస్వాదించు'అని టీమ్ మేనేజ్మెంట్ చెప్పింది. మా కెప్టెన్ కూడా అండగా నిలిచాడు. ఈ పిచ్పై ఎలా బౌలింగ్ చేయాలో చెప్పాడు. జట్టులోని ప్రతీ ఒక్కరు నాకు అండగా నిలిచారు. మా ఊరు మొత్తం నా ఆటను చూస్తోంది. ఈ రోజు నాకు అవకాశం దక్కింది. చాలా సంతోషంగా ఉంది.'అని అశ్వని కుమార్ చెప్పుకొచ్చాడు.