ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత హోమ్ గ్రౌండ్లో అదరిపోయే విజయాన్నందుకుంది. కోల్కతా నైట్రైడర్స్తో సోమవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ 16.2 ఓవర్లలో 116 పరుగులకు కుప్పకూలింది. అంగ్క్రిష్ రఘువంశీ(16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 26), రమణ్దీప్ సింగ్(12 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్(4/24) నాలుగు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్(2/19) రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, విజ్ఞేష్ పుతుర్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు.

అనంతరం ముంబై ఇండియన్స్ 12.5 ఓవర్లలోనే 2 వికెట్లకు 121 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ(12), విల్ జాక్స్(16) విఫలమైనా.. ర్యాన్ రికెల్టన్(41 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 62 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 27 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రస్సెల్(2/235) రెండు వికెట్లు దక్కాయి. ఈ భారీ విజయం ముంబై ఇండియన్స్ నెట్ రన్రేట్ను కూడా మెరుగుపర్చింది.
టర్నింగ్ పాయింట్..
పవర్ ప్లేలోనే కోల్కతా నైట్రైడర్స్ నాలుగు వికెట్లు కోల్పోవడం మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. పిచ్ నుంచి లభించిన సహాకారాన్ని అందిపుచ్చుకున్న ముంబై బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, అశ్వని కుమార్ నిప్పులు చెరగడంతో.. సునీల్ నరైన్(0), క్వింటన్ డికాక్(1), రహానే(11), వెంకటేశ్ అయ్యర్(3) పెవిలియన్ క్యూ కట్టారు. ఆ తర్వాత అశ్వని కుమార్ కేకేఆర్ను కుదురుకోనివ్వలేదు.
గెలిపించిన అశ్వని కుమార్
తన తొలి బంతికే అజింక్యా రహానేను ఔట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచిన అశ్వని కుమార్.. తన రెండో ఓవర్లో డేంజరస్ రింకూ సింగ్తో పాటు మనీష్ పాండేను పెవిలియన్ చేర్చాడు. మూడో ఓవర్లో విధ్వంసకర బ్యాటర్ ఆండ్రీ రస్సెల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో అరంగేట్ర ఐపీఎల్ మ్యాచ్లోనే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా అద్భుత కెప్టెన్సీ కూడా ముంబై విజయానికి కలిసొచ్చింది.