ముంబై: ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్నందుకుంది. గుజరాత్ టైటాన్స్తో శుక్రవారం జరిగిన కీలక పోరులో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. సూర్యకుమార్ యాదవ్(49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్లతో 103 నాటౌట్) విధ్వంసకర సెంచరీతో గుజరాత్ పతనాన్ని శాసించాడు.
ఈ విజయంతో ముంబై ఇండియన్స్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. ఈ ఫలితంతో రన్రేట్ మెరుగవ్వడంతో ఆ జట్టు చివరి 2 మ్యాచ్ల్లో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓడినా.. రషీద్ ఖాన్( 32 బంతుల్లో, 3 ఫోర్లు, 10 సిక్సర్లతో 79 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో ముంబైని వణికించాడు. మరో బ్యాటర్ నుంచి అతనికి మద్దతు లభిస్తే ఈ మ్యాచ్లో గుజరాత్ ఈజీగా గెలిచేది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగుల భారీ స్కోర్ చేసింది. సూర్యతో పాటు రోహిత్ శర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 29), ఇషాన్ కిషన్ (20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 31) రాణించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లు తీయగా.. మోహిత్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులు చేసి ఓటమిపాలైంది. రషీద్ ఖాన్కు తోడుగా డేవిడ్ మిల్లర్(41)రాణించాడు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్(3/31) మూడు వికెట్లు తీయగా.. పియూష్ చావ్లా, కుమార్ కార్తీకేయ తలో రెండు వికెట్లు తీసారు.
శుభారంభం లేదు: భారీ లక్ష్యచేధనలో గుజరాత్ టైటాన్స్కు సరైన శుభారంభం దక్కలేదు. ఆకాశ్ మధ్వాల్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే వృద్దిమాన్ సాహా(2) ఔటవ్వగా.. హార్దిక్ పాండ్యా(4)ను జాసన్ బెహ్రాండార్ఫ్ పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్లో ఆకాశ్.. శుభ్మన్(6)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్ ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలో గుజరాత్ 3 వికెట్లకు 48 పరుగులే చేసింది.
దెబ్బకొట్టిన చావ్లా: దూకుడుగా ఆడుతున్న శంకర్ను పియూష్ చావ్లా స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో గుజరాత్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. అభినవ్ మనోహర్(2)ను కార్తీకేయ ఔట్ చేయగా.. డేవిడ్ మిల్లర్(41)ను మధ్వాల్ వికెట్ల ముందు బోల్తాకొట్టించాడు. రాహుల్ తేవాటియా(14)ను చావ్లా ఔట్ చేయగా.. నూర్ అహ్మద్ను కార్తీకేయ పెవిలియ చేర్చాడు. దాంతో 103 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి ముంగిట నిలిచిన గుజరాత్ను రషీద్ ఖాన్.. అల్జారీ జోసెఫ్తో కలిసి ఆదుకున్నాడు.
భారీ షాట్లతో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ భారీ సిక్సర్లతో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కార్తీకేయ వేసిన ఆఖరి ఓవర్లో రషీద్ ఖాన్ మూడు సిక్సర్లు బాది అభిమానులను అలరించాడు.