ముంబై: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న కీలక పోరులో ముంబై ఇండియన్స్ టాస్ ఓడింది. వరుస విజయాలతో చేజింగ్ కింగ్గా మారిన ముంబై.. ఈ మ్యాచ్లో మాత్రం ముందుగా బ్యాటింగ్కు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తమకు అచ్చొచ్చిన చేజింగ్కు మొగ్గు చూపాడు. డ్యూ వచ్చే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. వికెట్ బాగుండటంతో పాటు డ్యూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చేజింగ్ సులువు అవ్వనుంది. ప్రతీ మ్యాచ్ గెలవడం ఎంత ముఖ్యమో మేం తెలుసుకున్నాం. మా ప్రణాళికలకు కట్టుబడి మంచి క్రికెట్ ఆడటంపై ఫోకస్ పెట్టాం. ఓటముల నుంచి గుణపాఠం నేర్చుకోవడం చాలా ముఖ్యం.

చేసిన తప్పిదాలను మరోసారి రిపీట్ కాకుండా సరిదిద్దుకోవాలి. బిగ్ టోర్నీల్లో తప్పులు చేయడం సహజమే. ఆ దేవుడి దయ వల్ల ఇప్పటి వరకైతే మా జట్టుకు గాయాల బెడద లేదు. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నామని రోహిత్ శర్మ తెలిపాడు. అయితే టోర్నీ కీలక దశలో ఉన్నప్పుడు ఏ సవాల్ను అయినా స్వీకరించాలన్నాడు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ సత్తా చాటాల్సిన అవసరం ఉందని చెప్పాడు. గత కొన్ని మ్యాచ్ల్లో తమకు పరిస్థితులు కలిసొచ్చాయని చెప్పిన రోహిత్... టోర్నీలో ప్రస్తుతం తమ స్థానం ఏంటో అర్థం చేసుకున్నామని, మ్యాచ్ గెలవడంపైనే ఫోకస్ పెట్టామని తెలిపాడు.
జట్టుకు గాయాల బెడద ఉండకూడదని, ఈ సమస్యను తాము అధిగమిస్తున్నామని చెప్పాడు. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని తెలిపాడు. ప్లే ఆఫ్స్ చేరాలంటే ముంబై ఇండియన్స్కు ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి.
తుది జట్లు:
గుజరాత్ టైటాన్స్: వృద్దిమాన్ సాహా(కీపర్), విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, నూర్ అహ్మద్
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(కీపర్), రోహిత్ శర్మ(కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేర, టీమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, విష్ణు వినోద్, పియూష్ చావ్లా, జాసన్ బెహ్రెండార్ఫ్, కుమార్ కార్తీకేయ