ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 73 నాటౌట్) దుమ్మురేపాడు. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో సూరీడు మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ చేశాడు. యువ బ్యాటర్ నమన్ ధీర్తో కలిసి 12 బంతుల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. ఢిల్లీ బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన మూడో ఓవర్లోనే రోహిత్ శర్మ(5) ఔటవ్వగా.. విల్ జాక్స్(21)ను ముఖేష్ కుమార్ పెవిలియన్ చేర్చాడు.
ర్యాన్ రికెల్టన్(25)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. సూర్యకుమార్ యాదవ్తో కలిసి 55 పరుగులు జోడించిన తిలక్ వర్మను ముఖేష్ కుమార్ పెవిలియన్ చేర్చాడు. హార్దిక్ పాండ్యా(3) కూడా తీవ్రంగా నిరాశపర్చడంతో ముంబై 123 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో నమన్ ధీర్తో సాయంతో సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 18 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై ఇండియన్స్ 132 పరుగులే చేసింది.

దాంతో ముంబై 160 పరుగులు చేస్తుందా? అనిపించింది. కానీ ముఖేష్ కుమార్ వేసిన 19వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ఓ భారీ సిక్సర్ బాదగా.. నమన్ ధీర్ 4, 6, 6, 4 బాది 27 పరుగులు పిండుకున్నాడు. దుష్మంత్ చమీరా వేసిన ఆఖరి ఓవర్లో సూర్య రెండు ఫోర్లు, రెండు సిక్స్లు బాది 21 పరుగులు పిండుకున్నాడు. 12 బంతుల్లో సూర్య, నమన్ ధీర్ 6,1,4,6,6,4,4,0,6,6,4,1 వరుసగా బౌండరీలు బాది 48 పరుగులు పిండుకున్నారు. దాంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 160 పరుగులు చేస్తుందా? అని అనుకున్న ముంబై ఇండియన్స్ 180 పరుగులు చేసింది.