
షార్జా: అవేశ్ ఖాన్(3/15), అక్షర్ పటేల్(3/21) మూడేసి వికెట్లతో చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ముంబై ఇండియన్స్ 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 33) మినహా అంతా విఫలమయ్యారు.
పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఢిల్లీ బౌలర్లు సమష్టిగా చెలరేగారు. దాంతో ముంబై ఇండియన్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ బౌలర్లలో అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్కు తోడుగా అన్రిచ్ నోర్జ్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు.
ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ(7).. అవేశ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. దాంతో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. దాంతో పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టానికి 35 రన్స్ చేసింది. అయితే పవర్ ప్లే ముగిసిన వెంటనే స్పిన్నర్ అక్షర్ పటేల్ను బౌలింగ్కు తెచ్చిన రిషభ్ పంత్.. ఆశించిన ఫలితాన్ని అందుకున్నాడు. అక్షర్ ఓవర్లో డికాక్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సౌరభ్ తివారీ బ్యాటింగ్కు రాగా.. సూర్య తన క్లాస్ షాట్స్తో అలరించాడు.
అయితే క్రీజులో కుదురుకున్న అతన్ని అక్షర్ పటేల్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. సౌరభ్ తివారీ(15)ని కూడా అక్షర్ పటేల్ ఔట్ చేయగా.. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన కీరన్ పొలార్డ్(6) నోర్జ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. రెండు ఫోర్లతో జోరు కనబర్చిన హార్దిక్ పాండ్యా(17)ను అవేశ్ ఖాన్ బౌల్డ్ చేశాడు. నాథన్ కౌల్టర్ నైల్(1) కూడా అవేశ్ ఖాన్ బౌలింగ్లోనే ఔటవ్వగా.. సిక్స్తో జోరు కనబర్చిన జయంత్ యాదవ్(11)ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. చివర్లో కృనాల్ పాండ్యా సిక్స్తో ముంబైకి పోరాడే లక్ష్యాన్ని అందించాడు.