ముంబై: ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో వరుసగా మూడు మ్యాచ్ల్లో డకౌటైన సూర్యకుమార్ యాదవ్.. ఐపీఎల్ 2023 సీజన్లోనూ దారుణంగా విఫలమవుతున్నాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన తొలి మ్యాచ్లో 15 పరుగులకే ఔటైన సూర్య.. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో 1 పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. మిచెల్ సాంట్నర్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేరాడు.సాంట్నర్ వేసిన డౌన్ లెగ్ డెలివరీని సూర్య.. స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి అతని గ్లోవ్స్ను తాకుతూ కీపర్ ధోనీ చేతిలో పడింది. అంపైర్ వైడ్ ఇవ్వగా.. ధోనీ రివ్యూ తీసుకొని ఫలితం సాధించాడు. బంతి గ్లోవ్స్ను తాకినట్లు అల్ట్రా ఎడ్జ్లో కనిపించింది. దాంతో సూర్య నిరాశగా పెవిలియన్ చేరాడు.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముందు వరకు సూపర్ ఫామ్ కనబర్చిన సూర్య.. ఒక్కసారిగా ఫామ్ కోల్పోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మైదానం నలు మూలల తనదైన శైలిలో చెలరేగే సూర్య.. ఒకటి రెండు బంతులకే ఔటవ్వడాన్ని సహించలేకపోతున్నారు. ముఖ్యంగా సూర్య పేలవ ఫామ్ ముంబై ఇండియన్స్ కొంపముంచుతోంది.
ఈ క్రమంలోనే నీ బ్యాడ్ టైమ్ కొనసాగుతుందిరా సూరీడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ రోహిత్(21)తో పాటు ఇషాన్ కిషన్(32), కామెరూన్ గ్రీన్(12), తిలక్ వర్మ(22), అర్షద్ ఖాన్(2), ట్రిస్టన్ స్టబ్స్(5) వరుసగా పెవిలియన్ చేరారు.
టీమ్ డేవిడ్(31) భారీ షాట్లతో ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా.. తుషార్ దేశ్ పాండే దెబ్బకొట్టాడు. టీమ్ డేవిడ్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో సీఎస్కే 131 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.