చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 2000 పరుగుల మైలు రాయి అందుకున్న తొలి భారత బ్యాటర్గా నిలిచాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా రుతురాజ్ గైక్వాడ్ ఈ ఫీట్ సాధించాడు.
రోమారియో షెఫర్డ్ బౌలింగ్లో బౌండరీ బాది ఐపీఎల్లో 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 57 ఇన్నింగ్స్ల్లో రుతురాజ్ గైక్వాడ్ ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్తో పాటు కేఎల్ రాహుల్ల రికార్డును బద్దలుకొట్టాడు.

ఓవరాల్గా క్రిస్ గేల్ 48 ఐపీఎల్ ఇన్నింగ్స్ల్లో 2000 పరుగుల మార్క్ను అందుకొని ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత షాన్ మార్ష్ 52 మ్యాచ్ల్లో ఈ ఫీట్ సాధించిన రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రుతురాజ్ గైక్వాడ్(57), కేఎల్ రాహుల్(60), సచిన్ టెండూల్కర్(63) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 69), శివమ్ దూబే(38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 66 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. చివరి ఓవర్లో మహేంద్ర సింగ్ ధోనీ(4 బంతుల్లో 3 సిక్స్లతో 20 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. గెరాల్డ్ కోయిట్జీ, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీసారు. రచిన్ రవీంద్రతో కలిసి 52 పరుగులు జోడించిన రుతురాజ్ గైక్వాడ్.. శివమ్ దూబేతో కలిసి మూడో వికెట్కు 90 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు.