ముంబై: ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ ఆ జట్టు చిత్తయ్యింది. చెన్నై సూపర్ కింగ్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. బౌలింగ్లో జడేజా చెలరేగితే.. బ్యాటింగ్ రహానే దంచికొట్టాడు. దాంతో సీఎస్కే సునాయస విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసింది. ఇషాన్ కిషన్(21 బంతుల్లో 5 ఫోర్లతో 32), టీమ్ డేవిడ్(22 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా(3/20) మూడు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్పాండే, మిచెల్ సాంట్నర్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన చెన్నై.. 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అజింక్యా రహానే(27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 61) హాఫ్ సెంచరీతో రాణించగా.. రుతురాజ్ గైక్వాడ్(36 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 40 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ముంబై బౌలర్లలో బెహ్రెండార్ఫ్, పియూష్ చావ్లా, కుమార కార్తీకేయ తలో వికెట్ తీసారు.
సాధారణ లక్ష్యచేధనతో బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు ఊహించని షాక్ తగిలింది. పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ డెవాన్ కాన్వే(0) వికెట్ను సీఎస్కే కోల్పోయింది. జాసన్ బెహ్రెండార్ఫ్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికి కాన్వే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే.. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
వరుస బౌండరీలతో ముంబై బౌలర్లను చెడుగుడు ఆడాడు. ముఖ్యంగా అర్షద్ ఖాన్ వేసిన నాలుగో ఓవర్లో రహానే 6, 4, 4, 4, 4, 1 వరుస బౌండరీలతో 23 పరుగులు పిండుకున్నాడు. అతనంతరం మరో రెండు సిక్స్లు బాది 19 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కావడం గమనార్హం.
రహానే ధాటికి చెన్నై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. అనంతరం మరో మూడు బౌండరీలు బాదిన రహానేను పియూష్ చావ్లా ఔట్ చేశాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే(28)తో కలిసి రుతురాజ్ గైక్వాడ్ ఆచితూచి ఆడాడు.
లక్ష్యం చిన్నదే కావడంతో రిస్క్ ఫ్రీ షాట్స్తో ఆ దిశగా కొనసాగారు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన రాయుడు(20 నాటౌట్) అతనికి అండగా నిలవడంతో చెన్నై విజయం లాంఛనమైంది.