ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్కు మరో ఘోర పరాజయం ఎదురైంది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి జోరు కనబర్చిన ఆ జట్టు.. పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 20 పరుగుల తేడాతో చిత్తయ్యింది. రోహిత్ శర్మ(63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్లతో 105 నాటౌట్) సెంచరీతో చెలరేగినా విజయాన్ని అందుకోలేకపోయింది.
అయితే ముంబై ఇండియన్స్ పరాజయానికి ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యానే కారణమయ్యాడు. ఆఖరి ఓవర్లో మహేంద్ర సింగ్ ధోనీ ధాటికి చివరి నాలుగు బంతులకు పాండ్యా ఇచ్చిన 20 పరుగులే ముంబై ఇండియన్స్ ఓటమిని శాసించాయి. 4 బంతులే ఆడిన ధోనీ 6,6,6,2తో 20 పరుగులు పిండుకొని చెన్నైకి 207 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించాడు.

ఈ నాలుగు బంతులను హార్దిక్ పాండ్యా కాస్త కట్టడిగా వేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఇక ధోనీ వింటేజ్ షాట్స్తో స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. ముంబై ఇండియన్స్ సరిగ్గా 186 పరుగులే చేసి 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్లో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్కు భారంగా మారడని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. బ్యాటింగ్లోనూ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడని మండిపడుతున్నారు.
చేజింగ్లో అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్న ముంబైని మతీష పతీరణ దెబ్బతీసాడు. ఒకే ఓవర్లో ఇషాన్, సూర్యను ఔట్ చేసిన అతను నిలకడగా ఆడుతున్న తిలక్ వర్మను శార్దూల్ ఠాకూర్ సాయంతో క్యాచ్ఔట్గా పెవిలియన్ చేర్చి మ్యాచ్ను మలుపు తిప్పాడు. తిలక్ ఔటవ్వకపోయినా ఫలితం మరోలా ఉండేది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 69), శివమ్ దూబే(38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 66 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. చివరి ఓవర్లో మహేంద్ర సింగ్ ధోనీ(4 బంతుల్లో 3 సిక్స్లతో 20 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. గెరాల్డ్ కోయిట్జీ, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేసి ఓటమిపాలైంది. రోహిత్ శర్మ (63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్లతో 105 నాటౌట్) శతక్కొట్టగా.. తిలక్ వర్మ(20 బంతుల్లో 5 ఫోర్లతో 31)పర్వాలేదనిపించాడు.
చెన్నై బౌలర్లలో మతీష పతీరణ(4/28) నాలుగు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. తుషార్ దేశ్పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలో వికెట్ తీసారు.