
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన వెంటనే జంబో జట్టుతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా కరోనా బ్రేక్ తర్వాత తొలి అంతర్జాతీయ సిరీస్ ఆడనుంది. సుమారు మూడు నెలల పాటు జరిగే ఈ సుదీర్ఘ పర్యటనలో కంగారూలతో మూడేసి వన్డేలు, టీ20లు సిరీస్తో పాటు నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో కూడా పోటీ పడనుంది. ఓ డే నైట్ మ్యాచ్ కూడా ఉండే టెస్టు సిరీస్ను భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఈ టూర్కు టీమిండియా పరిమిత ఓవర్ల వైస్కెప్టెన్ రోహిత్ శర్మను భారత సెలెక్షన్ కమిటీ పక్కన పెట్టేసింది.
ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా కింగ్స్ పంజాబ్తో జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్లో రోహిత్ తొడ కండరాలకు గాయమైంది. దాంతో అతను తదుపరి మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా ఫిజియో నితిన్ పటేల్ ఇచ్చిన రిపోర్ట్ కారణంగా సెలెక్టర్లు రోహిత్ శర్మను ఏ జట్టుకు ఎంపిక చేయలేదు. అయితే సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో రోహిత్ బరిలోకి దిగడంతో ఈ సెలెక్షన్ వ్యవహారం వివాదాస్పదమైంది. రోహిత్ను కావాలనే పక్కన పెట్టేసారని, ఇందులో విరాట్ కోహ్లీ కుట్ర ఉందని హిట్ మ్యాన్ అభిమానులు ఆరోపించారు.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ కూడా రోహిత్ ఆడటంతో అతను ఆసీస్కు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఈ నెల 27న మొదలయ్యే వన్డే సిరీస్కు రెస్ట్ ఇచ్చి టీ20 సిరీస్లో అయినా రోహిత్ను ఆడించాలనే యోచనలో టీమ్మేనేజ్మెంట్ ఉందని తెలసింది. కానీ రోహిత్ శర్మ ఫిట్నెస్పై టీమిండియా ఫిజియో నితిన్ పటేల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే అతను ఆసీస్ టూర్కు వెళ్తాడని ఓ బీసీసీఐ అధికారి తాజాగా స్పష్టం చేశారు.
'టీమిండియా ఫిజియో నితిన్ పటేల్ నిర్వహించే ఫిట్నెస్ టెస్ట్లో నెగ్గితేనే రోహిత్ ఆసీస్ టూర్కు వెళ్తాడు. అలా జరగకుంటే అతను ఆసీస్ టూర్కు వెళ్లలేడు. అయితే టెస్ట్ సిరీస్ వరకైనా అతను పూర్తిగా కోలుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే పెటర్నిటీ లీవ్తో చివరి రెండు టెస్ట్లకు విరాట్ కోహ్లీ దూరమయ్యే అవకాశం ఉంది'అని సదరు అధికారి పేర్కొన్నాడు. రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2020 సీజన్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగే టైటిల్ ఫైట్లో ఢిల్లీ క్యాపిటల్స్తో అమీతుమీ తేల్చుకోనుంది.