ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ తమ ఆఖరి పోరుకు సిద్దమైంది. లక్నో సూపర్ జెయింట్స్తో శుక్రవారం వాంఖడే వేదికగా జరగనున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై ఇండియన్స్.. పరువు కోసం పాకులాడుతోంది. ఈ మ్యాచ్లో గెలిచి ఈ సీజన్కు ఘనంగా ముగింపు పలకాలనుకుంటోంది.
మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ సైతం ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. గత మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో ఓడిపోవడంతో.. ముంబైపై గెలిచినా.. ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరలేదు. దాంతో లక్నో సూపర్ జెయింట్స్ కూడా ముంబై ఇండియన్స్ను ఓడించి విజయంతో ఈ సీజన్కు ముగింపు పలకాలనుకుంటోంది. ఈ మ్యాచ్కు ముంబై ఇండియన్స్ కొన్ని మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో నిమగ్నమైన రోహిత్ శర్మకు ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ నుంచి ముంబై మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు.
ఒకవేళ అతను లక్నోతో బరిలోకి దిగితే భారీ ఇన్నింగ్స్ ఆడాలని అతని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ ఒక్కటి మినహా తుది జట్టులో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. రోహిత్ శర్మకు రెస్ట్ ఇస్తే సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్గా ఆడే ఛాన్స్ ఉంది. అతనికి తోడు ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, నెహాల్ వధేరా, నమన్ ధిర్ మిడిలార్డర్లో ఆడనున్నారు. అన్షుల్ కంబోజ్, పియూష్ చావ్లా,నువాన్ తుషారా, జస్ప్రీత్ బుమ్రా పేసర్లుగా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు జరగ్గా.. ముంబై ఇండియన్స్ ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది.
ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టీమ్ డేవిడ్, నెహాల్ వధేరా, నమన్ ధిర్, అన్షుల్ కంబోజ్, పియూష్ చావ్లా, జస్ప్రిత్ బుమ్రా
ఇంపాక్ట్ ప్లేయర్: నువాన్ తుషారా