ఐపీఎల్ 2025 సీజన్లో వరుస విజయాలతో జోరు మీదున్న ముంబై ఇండియన్స్ మరో కీలక పోరుకు సిద్దమైంది. సొంతగడ్డపై ఆదివారం మధ్యామ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. వరుసగా 4 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చిన ముంబై.. అదే జోరును కొనసాగించి ఆరో టైటిల్ను ఎగరేసుకుపోవాలని భావిస్తోంది.
మరోవైపు గత మ్యాచ్లో ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకున్న లక్నో సూపర్ జెయింట్స్కు ఈ మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ గెలవడం కీలకమే. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఏకైక మార్పుతో..
ఈ మ్యాచ్కు కూడా ముంబై ఇండియన్స్ విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించే అవకాశం ఉంది. అయితే వాంఖడే వేదికగా ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో స్పెషలిస్ట్ స్పిన్నర్గా విజ్ఞేష్ పుతుర్కు బదులు కర్ణ్ శర్మను ఆడించవచ్చు. అయితే సన్రైజర్స్తో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్లో కర్ణ్ శర్మ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో అతని చేతికి రక్త స్రావమైంది. ఆ మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడిన కర్ణ్ శర్మ.. ఉప్పల్ వేదికగా జరిగిన గత మ్యాచ్ కూడా ఆడలేదు. కర్ణ్ శర్మ గాయంపై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఒకవేళ అతను ఫిట్ అయితే మాత్రం విజ్ఞేష్ పుతుర్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగి బౌలింగ్ చేస్తాడు.
సూపర్ ఫామ్లో రోహిత్..
ఈ ఒక్క మార్పు మినహా మిగతా లైనప్లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయనున్నారు. రోహిత్ గత రెండు మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కూడా సూపర్ ఫామ్లో ఉన్నారు. హార్దిక్ పాండ్యా తనదైన శైలిలో ఆడుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్లో సత్తా చాటుతున్నాడు. నమన్ ధిర్, మిచెల్ సాంట్నర్ కూడా పర్వాలేదనిపిస్తున్నారు. దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఈ త్రయం లయ అందుకోవడంతో ప్రత్యర్థి బ్యాటర్లు బెంబేలెత్తిపోతున్నారు.
లక్నోతో ముంబై తుది జట్టు(అంచనా)
ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధిర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
ఇంపాక్ట్ ప్లేయర్: విజ్ఞేష్ పుతుర్/కర్ణ్ శర్మ