న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్లో హ్యాట్రిక్ విజయాలతో జోరు కనబర్చి.. పంజాబ్ కింగ్స్తో గత మ్యాచ్లో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న ముంబై ఇండియన్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. గుజరాత్ టైటాన్స్తో మంగళవారం అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ మైదానం వేదికగా జరగనున్న మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనుంది. పంజాబ్ కింగ్స్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన ముంబై.. మళ్లీ విజయాల బాట పట్టాలనుకుంటోంది.
మరోవైపు అసాధారణ ప్రదర్శనతో ఓడిపోయే మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ను మట్టికరిపించిన గుజరాత్ టైటాన్స్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. సమష్టిగా రాణించడం గుజరాత్ ప్రధాన బలం కాగా.. సొంత మైదానంలో ఆడుతుండటం కలిసొచ్చే అంశం.

రెండు వరుస ఓటముల తర్వాత అద్భుత ప్రదర్శనతో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన ముంబై ఇండియన్స్.. అర్జున్ టెండూల్కర్ చెత్త బౌలింగ్తో పంజాబ్ చేతిలో ఓడింది. అర్జున్తో పాటు ముంబై డెత్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. అర్జున్ ఒకే ఓవర్లోనే 31 పరుగులిచ్చి ఈ సీజన్లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్గా చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. అతనితో పాటు జోఫ్రా ఆర్చర్, జాసన్ బెహ్రెండార్ఫ్, కామెరూన్ గ్రీన్ కూడా ధారళంగా పరుగులిచ్చుకున్నారు.
స్పిన్నర్లు పియూష్ చావ్లా, హృతిక్ షోకీన్లు మాత్రమే కట్టడిగా బౌలింగ్ చేశారు. ఈ క్రమంలోనే బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేయడంపై రోహిత్ సేన ఫోకస్ పెట్టింది. దారుణంగా విఫలమైన అర్జున్ టెండూల్కర్పై వేటు వేసి అర్షద్ ఖాన్ ఆడించే ప్రయత్నం చేయవచ్చు. అంతేకాకుండా జాసన్ బెహెండార్ఫ్ స్థానంలో రిలే మెరిడిత్ను ఆడించవచ్చు. అర్జున్కు మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం అర్షద్ ఖాన్ బెంచ్కే పరిమితమవుతాడు.
ఆరంభ మ్యాచ్ల్లో విఫలమైన ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా సెట్ అయ్యింది. సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి రావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్లు కూడా ఇప్పటికే ఫామ్ అందుకున్నారు. తిలక్ వర్మ సూపర్ ఫామ్లో ఉండగా.. గ్రీన్ సైతం టచ్లోకి వచ్చాడు. బ్యాటింగ్ బలహీనతలు అధిగమించినా.. ముంబైని డెత్ ఓవర్ల బలహీనత వేధిస్తోంది. జోఫ్రా ఆర్చర్ ఫామ్లోకి వస్తే ఈ సమస్య కూడా తీరనుంది.
అదే జరిగితే గుజరాత్పై ముంబైకి తిరుగుండదు. స్పిన్నర్లు పియూష్ చావ్లా, హృతిక్ షోకీన్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నారు. కుమార్ కార్తికేయా, నేహాల్ వాధేరాలను ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దించవచ్చు. బ్యాటింగ్లో నేహాల్.. బౌలింగ్లో కుమార్ కార్తీకేయ సేవలను ఉపయోగించుకోనున్నారు.
గుజరాత్తో ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, అర్జున్ టెండూల్కర్/అర్షద్ ఖాన్, జోఫ్రా ఆర్చర్, హృతిక్ షోకీన్, పియూష్ చావ్లా, జాసన్ బెహ్రాండార్ఫ్/రిలే మెరిడిత్.
ఇంపాక్ట్ ప్లేయర్: కుమార కార్తీకేయ/ నేహాల్ వాధేరా