ముంబై ఇండియన్స్ భవిష్యత్తు కోసమే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించామని ఆ జట్టు హెడ్ కోచ్ మార్క్ బౌచర్ తెలిపాడు. ఇది పూర్తిగా క్రికెట్కు సంబంధించిన నిర్ణయం మాత్రమేనని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ను హార్దిక్ పాండ్యా నడిపించనున్నాడు.
ఐపీఎల్ 2024 మినీ ఆక్షన్కు ముందే గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ విండో ద్వారా జట్టులోకి తీసుకుంది. పూర్తిగా క్యాష్ డీల్ ద్వారా అతన్ని జట్టులోకి తెచ్చుకోంది. ట్రేడింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే హార్దిక్ పాండ్యాను తమ సారథిగా ప్రకటించింది.

ముంబై ఇండియన్స్తోనే ప్రొఫెషనల్ కెరీర్ను ప్రారంభించిన హార్దిక్ పాండ్యా.. రెండేళ్ల విరామం తర్వాత సొంతగూటికి చేరాడు. అయితే హార్దిక్ పాండ్యా రాకను స్వాగతించిన అభిమానులు.. అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.
ఈ క్రమంలోనే ఓ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్.. కెప్టెన్సీ మార్పుకు గల కారణాలను వెల్లడించాడు. 'ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు అనేది పూర్తిగా క్రికెట్కు సంబంధించిన నిర్ణయం. హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకోవడానికి గల అవకాశాలన్నింటిని మేం పరిశీలించాం.
ట్రేడింగ్ విండో ద్వారా తీసుకున్నాం. ఇది జట్టుకు ట్రాన్సిషన్ ఫేజ్. భారత్లో చాలా మందికి ఇది అర్థం కాదు. దాంతో అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. అయితే అంతగా బాధపడాల్సిన పని లేదు. ఇది కేవలం క్రికెట్కు సంబంధించిన నిర్ణయం మాత్రమేనని వారు గుర్తించాలి. ఒక వ్యక్తిగా, ఆటగాడిగా రోహిత్ నుంచి అత్యుత్తమమైన ప్రదర్శన రావాలని కోరుకుంటున్నా. అతన్ని స్వేచ్చగా ఆడేలా చేయండి. ఆటను ఆస్వాదించే అవకాశం ఇవ్వండి.'అని మార్క్ బౌచర్ చెప్పుకొచ్చాడు.
అయితే మార్క్ బౌచర్ ఇంటర్వ్యూపై రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే స్పందించింది. 'ఈ నిర్ణయంలో చాలా తప్పులున్నాయి' అని సోషల్ మీడియాలో కామెంట్ చేసింది. దాంతో మరోసారి ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై విమర్శలు మొదలయ్యాయి. ఉద్దేశపూర్వకంగానే రోహిత్ శర్మను తప్పించారని మండిపడుతున్నారు.