
ఆక్లాండ్: ఐపీఎల్ 2021 సీజన్ కోసం ఏర్పాటు చేసిన బయో బబుల్ కరోనా ఆంక్షలు పాటించడాన్ని భారత్కు చెందిన పలువురు సీనియర్ ప్లేయర్లు ఇష్టపడేవారు కాదని ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్ జేమ్స్ పామెంట్ తెలిపాడు. అలాగని బయో బబుల్లో తాము ఏనాడు ఇబ్బంది పడలేదని జేమ్స్ పేర్కొన్నాడు. అయితే ఆ సీనియర్ ఆటగాళ్లు ఎవరా? అనే విషయాన్ని మాత్రం జేమ్స్ వెల్లడించలేదు.
'ఇండియాకు చెందిన కొందరు సీనియర్ ప్లేయర్లు బబుల్లో రూల్స్ పాటించేందుకు ఇష్టపడేవారు కాదు. ఇష్టమొచ్చినట్లు ఉండేవారు. కానీ ఏ సందర్భంలోనూ మేం ఇన్సెక్యూర్డ్గా ఫీలవ్వలేదు. ట్రావెలింగ్ టైమ్లో ఇబ్బంది తప్పదని ముందే ఊహించాం. కానీ ఇతర జట్లలో కరోనా కేసులు రావడంతో మాలో భయం మొదలైంది. తమ టీమ్లోనూ కేసులున్నాయని చెన్నై ప్రకటించిన తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది.
న్యూజిలాండ్, ఆసీస్ ప్లేయర్లు ఇంటికి వెళ్లడం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు'అని పామెంట్ చెప్పుకొచ్చాడు. ఆరు నగరాల్లో ఐపీఎల్ నిర్వాహించాలనుకోవడం నిర్వహకులు చేసిన అతిపెద్ద తప్పిదమని, ఒకే వేదికగా ప్లాన్ చేసుంటే సక్సెస్ అయ్యేదన్నాడు. ఆటగాళ్ల ప్రయాణాల కారణంగానే వైరస్ బబుల్లోకి ప్రవేశించిందని అభిప్రాయపడ్డాడు.
ఇక కరోనా వైరస్ ఆటగాళ్లకు సోకడంతో బీసీసీఐ ఈ క్యాష్ రిచ్ లీగ్ను నిరవధికంగా వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించే విషయంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఆటగాళ్లంతా తమ స్వస్థలాకు వెళ్లిపోయారు.