ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తున్నాడు. టీమిండియా సక్సెస్ఫుల్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మను బ్యాటింగ్కు మాత్రమే పరిమితం చేయడంపై ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి ఇబ్బంది కలగవద్దనే రోహిత్ శర్మను బ్యాటింగ్కు పరిమితం చేశారని కూడా ఆరోపించారు.
అయితే ఈ ఊహాగానాలన్నిటికీ తెరదించుతూ.. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్దనే స్పష్టత ఇచ్చాడు. రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించడం వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించాడు. రోహిత్ శర్మ చిన్నపాటి గాయంతో ఇబ్బంది పడుతున్నాడని, ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి అతనికి గాయం ఉందని చెప్పాడు. ఈ సీజన్ ప్రారంభంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు.
గాయంతో రోహిత్ శర్మ చురుగ్గా ఫీల్డింగ్ చేయలేడనే బ్యాటింగ్కు పరిమితం చేశామని చెప్పాడు. కొన్ని మ్యాచ్ల్లో రోహిత్ శర్మ ఫీల్డింగ్కు వచ్చాడని గుర్తు చేశాడు. రోహిత్ కారణంగా ముంబై ఇండియన్స్కు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ లభిస్తుందన్నాడు.

కొన్ని మైదానాల్లో బౌండరీల వద్ద వేగంగా కదలగల ఆటగాళ్ళు అవసరమని, రోహిత్ శర్మ బ్యాటింగ్ జట్టుకు అవసరమని, అతనిపై అనవసర ఒత్తిడి తీసుకురావద్దనే ఇంపాక్ట్ సబ్గా ఆడిస్తున్నామని జయవర్దనే వివరణ ఇచ్చాడు. రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేయకున్నా జట్టుకు కావాల్సిన సహకారం అందిస్తున్నాడని చెప్పాడు. డగౌట్లోనే ఉంటూ.. టైమ్ ఔట్లో విలువైన సలహాలు అందిస్తున్నాడని, టీమ్ మీటింగ్స్లో చురుగ్గా పాల్గొంటున్నాడని పేర్కొన్నాడు. ఫీల్డ్ సెటప్, బౌలింగ్ మార్పుల విషయంలోనూ సలహాలు ఇస్తున్నాడని చెప్పాడు.
జయవర్దనే వ్యాఖ్యలతో భారత అభిమానుల్లో ఆందోళన నెలకొంది. గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మ.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తాడా? అనే సందేహాలు నెలకొన్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన అనంతరం 5 టెస్ట్ల సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఆలోపు రోహిత్ శర్మ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని బీసీసీఐ భావిస్తోంది. ఒకవేళ రోహిత్ శర్మ దూరమైతే.. శుభ్మన్ గిల్ జట్టును నడిపించే అవకాశం ఉంది. గాయాల బెడద నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రాను టెస్ట్ వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించనున్నారు.