
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్లో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తాము చాలా మిస్సయ్యామని ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ అన్నాడు. ఈ సీజన్లో హార్దిక్ పాండ్యా చాలా అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు. ఐపీఎల్ 2022 తరహాలోనే ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచకప్లో టీమిండియా తరఫున రాణిస్తాడని జోస్యం చెప్పాడు. గతేడాది వరకు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్కు ఆడిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ మెగా వేలానికి ముందు ఆ జట్టు అతన్ని వదులుకోగా.. గుజరాత్ టైటాన్స్ తమ కెప్టెన్గా నియమించుకుంది.
ఇక ఐపీఎల్ 2022 సీజన్లో బ్యాట్తో పాటు బంతితో మెరిసిన హార్దిక్ పాండ్యా.. తనదైన సారథ్యంతో జట్టును టేబుల్ టాపర్గా నిలపడమే కాకుండా టైటిల్ అందించాడు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యాను కొనియాడిన షేన్ బాండ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'హార్దిక్ పాండ్యా చాలా కూల్ కెప్టెన్. నేను బౌలింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్ నుంచి హార్దిక్ నాకు తెలుసు. పాండ్యా వేరే ఫ్రాంచైజీకి కెప్టెన్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది.అయితే మేం అతడి సేవలను కోల్పోయాము. అతడు అద్భుతమైన ఆటగాడు కాబట్టి మా జట్టులో ఉంటే బాగుండేది.
ఇక టీ20 ప్రపంచకప్కు అతని సేవలు భారత్కు చాలా అవసరం. అతడు ఒక కెప్టెన్గా, ఆల్ రౌండర్గా తన సత్తా ఎంటో చూపించాడు" అని స్పోర్ట్స్కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేన్ బాండ్ చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్-2022 సీజన్లో హార్దిక్ పాండ్యా 15 మ్యాచ్లు ఆడి 487 పరుగులతో పాటు, 8 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఫైనల్లో 3/17 బెస్ట్ బౌలింగ్తో ప్రత్యర్థి జట్టు ఓటమిని శాసించాడు. ఇక సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరగనున్న 5 టీ20ల సిరీస్ కోసం హార్దిక్ సమాయత్తం అవుతున్నాడు.