అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటన నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. గోట్ టూర్ ఆఫ్ ఇండియా పేరిట మెస్సీ శనివారం తెల్లవారుజామున భారత్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో నిర్వాహకులు ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ ఏర్పాటు చేశారు. టికెట్లను కూడా భారీ సంఖ్యలో విక్రయించారు. వరల్డ్ ఫుట్బాల్ స్టార్ అయిన మెస్సీని ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.
వేలు ఖర్చు పెట్టి మరీ టికెట్లను కొనుగోలు చేశారు. కానీ మెస్సీ మాత్రం ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. పట్టుమని పది నిమిషాలు కూడా స్టేడియంలో ఉండలేదు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రేక్షకులు స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేసి తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. కోల్కతాలోని వివేకానంద యువభారతి సాల్ట్ లేక్ స్టేడియంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఫ్యాన్స్ ఆగ్రహంతో మెస్సీ స్టేడియంలోని సొరంగం నుంచి వెళ్లిపోయారు. ఫ్యాన్స్ ను నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రేక్షకులు స్టేడియంలోకి దూసుకొచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్స్కు నిప్పు పెట్టారు. స్టేడియంలో గందర గోళ పరిస్థితులు నెలకొన్నాయి. 2011 తర్వాత మెస్సీ భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. కానీ అప్పటిలా ఫుట్బాల్ మ్యాచ్ కోసం కాకుండా.. ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం భారత్లో అడుగుపెట్టాడు.
శనివారం ప్రారంభమైన మెస్సీ పర్యటన సోమవారం ముగియనుంది. మూడు రోజుల పాటు భారత్లో ఉండనున్న మెస్సీ.. కోల్కతాతో పాటు హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలో పర్యటించనున్నాడు. మెస్సీతో పాటు అతని ఇంటర్ మియామీ జట్టు సహచర ఆటగాళ్లు రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెజ్ వస్తున్నారు. ఈ టూర్లో మెస్సీ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రులు, కార్పొరేట్ దిగ్గజాలు, బాలీవుడ్ సెలెబ్రిటీలను కలవనున్నాడు. ఉప్పల్ స్టేడియం వేదికగా శనివారం రాత్రి 7 గంటలకు ఫ్రెండ్లీ మ్యాచ్లో మెస్సీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తలపడనున్నాడు. ఈ మ్యాచ్కు తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.