హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నీలో విజేతగా నిలిచిన పాకిస్థాన్పై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుతున్నాయి. ప్రపంచకప్ గెలిచిన రీతిలో పాకిస్థాన్ సంబరాలు చేసుకోవాలని భారత నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పాకిస్థాన్ టైటిల్ సాధించినా.. భారత్ను మాత్రం ఓడించలేకపోయిందని ఎగతాళి చేస్తున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ విజయానికి సంబంధించిన మీమ్స్, పారడీ ట్వీట్ పోస్ట్లు నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి.
హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నీలో పాకిస్థాన్ ఛాంపియన్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో పాకిస్థాన్ 43 పరుగుల తేడాతో కువైట్ను ఓడించింది. ఈ గెలుపును పాకిస్థాన్ ఆటగాళ్లు తమదైన శైలిలో సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ 6 రోజుల సెలువులు ప్రకటించాడని పారడీ అకౌంట్స్తో భారత నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.

'హాంగ్ కాంగ్ సూపర్ సిక్సెస్ టోర్నీలో విజేతగా నిలిచిన పాకిస్థాన్ జట్టుకు అభినందనలు. భారత కామెంటేటర్స్ ఎలెవన్ను మనం ఓడించలేకపోయినా.. ఈ విజయం ప్రపంచకప్ గెలుపు కంటే ఏ మాత్రం తక్కువ కాదు. ఈ విజయం నేపథ్యంలో దేశవ్యాప్తంగా 6 రోజులు సెలవుగా ప్రకటిస్తున్నా'అని షెహ్బాజ్ షరీఫ్ పారిడీ అకౌంట్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్కు అశ్విన్ పారిడీ అకౌంట్ నుంచి విక్టరీ పరేడ్ కూడా ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నట్లు కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారుతుంది.
భారత్ చేతిలో ఓడిన పాకిస్థాన్ ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో పాకిస్థాన్ విజేతగా నిలవడం ఆరోసారి. ఈ టోర్నీ చరిత్రలోనే పాకిస్థాన్ కంటే ఎక్కువ సార్లు టైటిల్ గెలిచిన జట్టు మరొకటి లేదు.
ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. అబ్దుల్ సమద్ 13 బంతుల్లో 42 పరుగులు చేశాడు. కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది 11 బంతుల్లో 52 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. ఖ్వాజా నాఫే 6 బంతుల్లో 22 పరుగులు చేశాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కువైట్ జట్టు 5.1 ఓవర్లలో 92 పరుగులకే పరిమితమై 43 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పాకిస్తాన్ తరఫున మాజ్ సదాకత్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు.