
హైదరాబాద్ : మాజీ రాజ్యసభ ఎంపీ, మెగాస్టార్ చిరంజీవికి భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ధన్యవాదాలు తెలిపాడు. గత శుక్రవారం(ఏప్రిల్ 24) మాస్టర్ బర్త్డే సందర్భంగా చిరంజీవి క్రికెట్ గాడ్కు ట్విటర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. 'క్రికెట్ గాడ్, ఇండియా ప్రైడ్, వన్ అండ్ ఓన్లీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు జన్మదిన శుభాకాంక్షలు. భావి తరాలకు మీరు ఇలానే స్ఫూర్తినిస్తూ ఉండాలి. ఆ దేవుడి ఆశిస్సులు మీకుండాలి'అని చిరంజీవి ట్వీట్ చేశారు.
దీనికి సచిన్ సోమవారం బదులిచ్చాడు. 'మీ గొప్ప పదాలకు ధన్యవాదాలు చిరంజీవీ గారు.. మీ వాళ్లంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తు'అని ట్వీట్ చేశాడు. దీనికి మంగళవారం చిరు క్రికెట్స్టైల్లో బదులిచ్చారు. 'థాంక్యూ సచిన్ బ్రదర్, అంతా క్షేమం. ఇప్పటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో డిఫెన్స్ ఆడడమే సరైన విధానం. నేను అందరికీ ఇదే విషయం చెబుతున్నాను' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు.
ఇటీవలే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన మెగాస్టార్ తనదైన శైలిలో నెటిజన్లకు కావాల్సిన వినోదాన్ని పంచడంతో పాటు మంచి సందేశాలను అందిస్తున్నారు. ఈ రోజు ఉదయం తన మనువరాలు శ్రీజ చిన్న కుమార్తె నవిష్కతో చేసిన సందడికి సంబంధించిన వీడియోను షేర్ చేసి నెటిజన్లను ఆకట్టుకున్నాడు.
కాగా, సచిన్ టెండూల్కర్తో చిరంజీవికి ఎప్పటి నుంచో వ్యక్తిగతంగా పరిచయం ఉంది. అయితే, ఇండియన్ సూపర్ లీగ్ వల్ల వీళ్ల మధ్య బంధం మరింత బలపడింది. ఈ లీగ్లో పాల్గొన్న కేరళ బ్లాస్టర్స్ ఫుట్బాల్ క్లబ్కు సచిన్ సహ చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్లు యజమానులుగా ఉండేవారు.
అయితే, రెండేళ్ల క్రితం తన 20 శాతం వాటాను చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్లకు సచిన్ విక్రయించారు. నష్టాలు రావడంతోనే సచిన్ తన వాటాను అమ్మేశారు. ఇక ఈ సంస్థకే చెందిన ప్రోకబడ్డీ లీగ్లోని తమిళ తలైవాస్లో కూడా సచిన్ టెండూల్కర్, చిరంజీవి సహాయజమానులుగా వ్యవహరించారు.