టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పడంతోనే ముంబై జట్టును వీడాలనే నిర్ణయాన్ని యశస్వి జైస్వాల్ మార్చుకున్నాడని ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ప్రెసిడెంట్ అజింక్యా నాయక్ తెలిపారు. ముంబై క్రికెట్ అసోసియేషన్లో కొనసాగితేనే కెరీర్ బాగుంటుందని యశస్వికి రోహిత్ అర్థమయ్యేలా చెప్పాడని నాయక్ వెల్లడించారు. ముంబై జట్టు తరఫున క్రికెట్ కెరీర్ ప్రారంభించిన యశస్వి జైస్వాల్.. ఆ మధ్య జట్టును వీడేందుకు సిద్దమయ్యాడు.
గోవా టీమ్ కెప్టెన్సీ ఆఫర్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికేట్)కి కూడా దరఖాస్తూ చేసుకున్నాడు. ఎంసీఏ సైతం అతనికి ఎన్ఓసీ ఇచ్చింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ యశస్వి జైస్వాల్ యూటర్న్ తీసుకున్నాడు. ముంబై జట్టులోని కొనసాగుతానని తెలిపాడు. అయితే జైస్వాల్ యూటర్న్ నిర్ణయం వెనుక ఉన్న సీక్రెట్ను తాజాగా ఎంసీఏ అధ్యక్షుడు వెల్లడించాడు.

'ముంబై జట్టులోనే కొనసాగాలని యశస్వి జైస్వాల్కు రోహిత్ శర్మ సూచించాడు. 42 రంజీ టైటిల్స్ గెలిచిన ముంబై జట్టులో కొనసాగడం ఎంతో గౌరవం, ప్రతిష్ట దక్కుతుందని యశస్వికి వివరించాడు. అంతేకాకుండా ప్రతిభ చాటుకోవడానికి యశస్వి జైస్వాల్కు ముంబై జట్టు ఒక మంచి వేదికగా నిలిచిందని, అందుకు ఈ నగరానికి కృతజ్ఞతతో ఉండాలని కూడా రోహిత్ చెప్పాడు. ఈ మాటలతోనే యశస్వి జైస్వాల్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.'అని ఓ జాతీయ ఛానెల్తో అజింక్యా నాయక్ చెప్పుకొచ్చాడు.
ఇంగ్లండ్తో జరిగిన ఆఖరి టెస్ట్కు రోహిత్ శర్మ హాజరయ్యాడు. మూడో రోజు ఆటను ప్రేక్షకుడిగా వీక్షించాడు. ఆ సమయంలో యశస్వి జైస్వాల్ శతకంతో చెలరేగాడు. సెంచరీ పూర్తయిన వెంటనే రోహిత్ శర్మవైపు తిరిగి ముద్దుల వర్షం కురిపించాడు. ఆ రోజు ఆట అనంతరం ఈ విషయాన్ని యశస్వి జైస్వాల్ మీడియాకు తెలియజేశాడు. 'రోహిత్ భాయ్ మ్యాచ్కు రావడం నేను చూశాను. ఆయనకు హాయ్ కూడా చెప్పాను. బాగా ఆడాలని రోహిత్ భాయ్ సైగలతో చెప్పాడు. సీనియర్ ఆటగాళ్ల నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. రోహిత్, కోహ్లీ భాయ్ సలహాలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వారి సూచనలు క్రికెటర్గా నేను ఎదిగేందుకు ఉపయోగపడ్డాయి. 'అని జైస్వాల్ చెప్పుకొచ్చాడు.