ఇంగ్లండ్ పర్యటనను ఘనంగా ముగించిన టీమిండియా.. నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా కప్ 2025 బరిలోకి దిగనుంది. టీ20 ప్రపంచకప్ 2026కు సన్నాహకంగా ఆసియాకప్ను పొట్టి ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించిన భారత జట్టును ఆగస్ట్ మూడో వారంలో ప్రకటించనున్నారు.
ఇప్పటికే టీమ్ సెలెక్షన్పై అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ఫోకస్ పెట్టింది. ఇంగ్లండ్ పర్యటనలో ఆడిన బుమ్రా, సిరాజ్లకు వర్క్లోడ్ మేనేజ్మెంట్లోగా ఆసియా కప్ నుంచి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే గంభీర్ కొత్త బౌలింగ్ దళాన్ని తయారు చేయాలనుకుంటున్నాడని తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో ఒక్క మ్యాచ్ ఆడని అర్ష్దీప్ సింగ్.. ఆసియాకప్లో టీమిండియా బౌలింగ్ విభాగాన్ని నడిపించనున్నాడు. అతనికి తోడుగా ఐపీఎల్ సెన్సేషన్, గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే మయాంక్ యాదవ్ను ఎంపిక చేయాలని గంభీర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

బుమ్రా తరహాలో మయాంక్ యాదవ్ను కీలక ఆయుధంగా మార్చుకోవాలని గంభీర్ వ్యూహ రచన చేస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే అతన్ని ఆసియా కప్లోకి తీసుకోవాలని గంభీర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఐపీఎల్ 2025 సీజన్లో మాయంక్ యాదవ్ మరోసారి గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో న్యూజిలాండ్లో సర్జరీ చేసుకున్నాడు. ఈ గాయం నుంచి కోలుకోవడానికి అతనికి 8 నెలల సమయం పడుతుందని వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే మయాంక్ యాదవ్ ఆసియా కప్ ఆడటం సందేహాస్పదంగా మారింది. టీ20 ప్రపంచకప్కు మయాంక్ యాదవ్ను సిద్దం చేయాలనే గంభీర్ ప్రణాళిక వర్కౌట్ అవుతుందా? లేదా? అనేది కూడా సందేహంగా మారింది. టీ20 ప్రపంచకప్ సమయానికి మయాంక్ యాదవ్ను జట్టులోకి తీసుకురావాలనేదే గంభీర్ ప్లాన్గా తెలుస్తోంది. అతను ఇప్పటికే టీమిండియా తరఫున బరిలోకి దిగినా.. గాయాల కారణంగా తరుచూ ఆటకు దూరమవుతున్నాడు.