
న్యూఢిల్లీ: పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలను శిఖర్ ధావన్ స్వీకరిస్తాడని భావించిన అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఈ సీనియర్ వెటరన్ ఓపెనర్ను కాదని మయాంక్ అగర్వాల్కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని పంజాబ్ టీమ్మేనేజ్మెంట్ భావిస్తోందంట. ఈ వారం చివరిలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. గత సీజన్ వరకు కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్.. జట్టును వీడి లక్నోతో జత కట్టడంతో పంజాబ్.. ఇద్దరి ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. మయాంక్ అగర్వాల్(రూ.12 కోట్లు)తో పాటు అనామక ప్లేయర్ హర్షదీప్ సింగ్(రూ.4 కోట్లు)ను అంటిపెట్టుకుంది.
ఇక వేలంలో శిఖర్ ధావన్ను తీసుకున్న ఆ జట్టు.. జానీ బెయిర్ స్టో, లియామ్ లివింగ్స్టోన్ , కగిసో రబడా వంటి వరల్డ్ క్లాస్ పేయర్లను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే సీనియర్ ప్లేయర్ అయిన ధావన్ కెప్టెన్ అవ్వడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ టీమ్మేనేజ్మెంట్ మాత్రం అతని పట్ల సుముఖంగా లేదని తెలుస్తోంది.'ధావన్ చాంపియన్ ప్లేయర్. అతను జట్టులోకి రావడం వల్ల అదనపు బలం చేకూరుతుంది. రాహుల్ జట్టును వదిలిపెట్టిన నాటి నుంచి మయాంక్నే కెప్టెన్గా అనుకున్నాం"అని క్రికెట్ వర్గానికి చెందిన ఓ ప్రతినిధి తెలిపారు.
గత కొన్నేళ్లుగా మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ జోడీ ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసింది. జట్టు నుంచి బయటకు వచ్చిన రాహుల్ ప్రస్తుతం కొత్త జట్టు లక్నో సూపర్జెయింట్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గతేడాది రాహుల్కు గాయమైన సమయంలో మయాంక్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన అనుభవం కూడా ఉంది. గత రెండు సీజన్లలో 400కు పైగా పరుగులు సాధించాడు. 2011లో ఐపీఎల్లో అడుగుపెట్టిన అతను 100కు పైగా మ్యాచులు ఆడగా..భారత్ తరఫున 19 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు.ఇప్పటి వరకూ కప్పు గెలవని పంజాబ్ ఈ సారైనా ట్రోఫీని దక్కించుకోవాలని ఆశలు పెట్టుకుంది. 2014లో ఫైనల్లో అడుగుపెట్టిన పంజాబ్ గత మూడు సీజన్లలోనూ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.