
ముంబై: చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్తోనే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఘోర ఓటమిని చవిచూశామని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అన్నాడు. వీలైనంత త్వరగా ఈ మ్యాచ్ ఫలితాన్ని మరిచిపోయి ముందుకు సాగాలని అభిప్రాయపడ్డాడు. బుధవారం ఏక పక్షంగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్లతో తేడాతో పంజాబ్ కింగ్స్ను చిత్తు చేసింది. మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై స్పందించిన మయాంక్ అగర్వాల్ సమష్టిగా విఫలమయ్యామని తెలిపాడు. 180 పరుగులు చేస్తే గెలవడానికి అవకాశం ఉండేదన్నాడు. తన కెప్టెన్సీ వైఫల్యం కూడా ఢిల్లీకి కలిసొచ్చిందన్నాడు.
'ఇది అత్యంత కఠినమైన రోజు. వీలైనంత త్వరగా మరిచిపోవాలి. ఎక్కువగా ఆలోచించకుకుండా ముందుకు సాగాలి. బ్యాటింగ్, బౌలింగ్లో దారుణంగా విఫలమయ్యాం. ఈ రోజును ఓ పీడకలగా మరిచి ముందుకు సాగాల్సిన అవసరం మాకుంది. ఆరంభంలోనే ఎక్కువ వికెట్లు కోల్పోతున్నాం. ఈ విషయంపై ఫోకస్ చేయాలి. 180 పరుగులు చేసుంటే పోరడడానికి ఏమైనా అవకాశం ఉండేది. అంతేకాకుండా నేను ఆరంభంలోనే ఓ రెండు ఓవర్లు స్పిన్నర్లతో వేయించాల్సింది. కానీ అది చేయలేకపోయాను.'అని మయాంక్ చెప్పుకొచ్చాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులకు కుప్పకూలింది. యువ ప్లేయర్ జితేశ్ శర్మ(23 బంతుల్లో 5 ఫోర్లు 32), మయాంక్ అగర్వాల్(15 బంతుల్లో 4 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 10.3 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 119 పరుగులు చేసి 57 బంతులు మిగిలుండగానే గెలుపొందింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(30 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 60 నాటౌట్), పృథ్వీ షా(20 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 41) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు.