అప్పుడెప్పులో 90లో..
1990లో న్యూజిలాండ్లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్లో భారత మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ ఓపెనర్గా బరిలోకి దిగి తొలి సెషన్ అంతా క్రీజ్లో నిలిచాడు. ఆ తర్వాత మరే ఓపెనర్ న్యూజిలాండ్ గడ్డపై తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేయలేకపోయారు. తాజాగా మయాంక్ ఆ ఘనతనందుకున్నాడు. నపియర్ వేదికగా జరిగిన ఆ నాటి మ్యాచ్లో మనోజ్ కుమార్ 268 బంతుల్లో 95 పరుగులు చేశాడు. దీంతో ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 358/9 వద్ద డిక్లేర్ చేసింది. చివరకు ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. న్యూజిలాండ్ పిచ్లు స్వింగ్కు అనుకూలించడంతో ఫస్ట్ సెషన్ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అందుకే మేటీ బ్యాట్స్మన్ కూడా త్వరగా పెవిలియన్ చేరుతారు.
పెవిలయన్ చేర్చిన ట్రెంట్ బౌల్ట్
తాజా మ్యాచ్లో ఫస్ట్ సెషన్ మొత్తం ఓపికగా ఆడిన మయాంక్(34) లంచ్ తర్వాత నాల్గో వికెట్గా పెవిలియన్ చేరాడు. అతన్ని క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చిన ట్రెంట్ బౌల్ట్ తన రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. అంతకుముందు రెండో వికెట్గా చతేశ్వర్ పుజారా(11), మూడో వికెట్గా కోహ్లి(2) పెవిలియన్కు చేరారు. దీంతో లంచ్లోపే భారత్ మూడు వికెట్లను కోల్పోయింది. ఆ సమయంలో మయాంక్తో రహానే ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. నాల్గో వికెట్కు వీరిద్దరూ 48 పరుగులు జత చేసిన తర్వాత మయాంక్ ఔట్ కాగా, ఆ వెంటనే హనుమ విహారి(7)ని జేమీసన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 101 పరుగులకే భారత్ ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
పంత్-రహానే..
అనంతరం ఈ టూర్ ఆసాంతం బెంచ్కే పరిమితమైన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్కు ఈ మ్యాచ్లో ఎట్టకేలకు అవకాశం దక్కింది. స్పెషలిస్ట్ కీపర్ వృద్దీమాన్ సాహాను కాదని టీమ్మేనేజ్మెంట్ పంత్కు అవకాశం ఇచ్చింది. ఈ యువ వికెట్ కీపర్ సాయంతో రహానే ఇన్నింగ్స్ను ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేశాడు. ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడటంతో భారత్ 122/5 స్కోర్తో రెండో సెషన్ బ్రేక్ వెళ్లింది. అనంతరం వర్షం అంతరాయం కలిగించడంతో మూడో సెషన్ ఒక్క బంతి పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. పిచ్ నుంచి లభించిన స్వింగ్ను అందిపుచ్చుకున్న ఆతిథ్య బౌలర్లు భారత్ పతనాన్ని శాసించారు. జెమీసన్ మూడు వికెట్లు తీయగా, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్లు తలో వికెట్ తీశారు.