
లార్డ్స్: ఐపీఎల్ 2022 సీజన్లో దారుణంగా విఫలమైన సన్రైజర్స్ హైదరాబాద్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ .. ఇంగ్లండ్ గడ్డపై అదే తడబాటును కొనసాగిస్తున్నాడు. ఫార్మాట్ మారినా కేన్ మామ ఆట తీరు మాత్రం మారలేదు. ఐపీఎల్ 2022 సీజన్లో 13 మ్యాచ్లు ఆడిన కేన్ మామ 19.63 సగటుతో 216 పరుగులు మాత్రమే చేసాడు. అతని వైఫల్యం జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది.
రెండు వరస పరాజయాలతో లీగ్ను ప్రారంభించిన సన్రైజర్స్.. ఆ తర్వాత వరుసగా 5 మ్యాచ్లు గెలిచి ఆశలు రేకెత్తించింది. కానీ ఆ తర్వాత మరో 5 మ్యాచ్ల్లో ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలను చేజార్చుకుంది. ఓవరాల్గా 14 మ్యాచ్ల్లో 6 విజయాలతో 8వ స్థానంలో నిలిచింది.
ఇక ఇంగ్లండ్తో మూడు టెస్ట్ల సిరీస్లో భాగంగా లార్డ్స్ వేదికగా బుధవారం ప్రారంభమైన తొలి టెస్ట్లో కేన్ మామ.. తన పేలవ ఫామ్ను కొనసాగించాడు. రెండు ఇన్నింగ్స్ల్లో (2, 15) దారుణంగా విఫలమయ్యాడు. రెండు సార్లు ఇంగ్లండ్ అరంగేట్ర పేసర్ మాథ్యూ పాట్స్ బౌలింగ్లోనే ఔటయ్యాడు.
తొలి ఇన్నింగ్స్లో కీపర్ క్యాచ్గా వెనుదిరిగిన కేన్.. రెండో ఇన్నింగ్స్లో స్లిప్లో బెయిర్ స్టో చేతికి చిక్కాడు. దాంతో కేన్ విలియమ్సన్పై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. జట్టు మారినా.. కేన్ ఆట మారలేదని కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ సన్రైజర్స్ను ఆగం జేసినట్లు అక్కడ న్యూజిలాండ్ను చేస్తున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు.
ఇక తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 132 పరుగులకే కుప్పకూలగా.. ఇంగ్లండ్ 141 పరుగులకు ఆలౌటై 9 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
మళ్లీ స్వల్ప స్కోర్కే ఆలౌటవుతుందా? అనిపించింది. కానీ క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్(75 బ్యాటింగ్), టామ్ బ్లండెల్(63 బ్యాటింగ్) అసాధారణ పోరాడటం ఆదుకున్నారు. హాఫ్ సెంచరీలు నమోదు చేసి ఇన్నింగ్స్ను నిలకడగా నడిపిస్తున్నారు.