
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా తెలివైన ఆటగాడని ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ మాథ్యూవేడ్ తెలిపాడు. మోకాలి సర్జరీ చేయించుకున్న అతను తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెప్టెన్ కోహ్లీ మాట్లాడే మాటలు లేదా ప్రవర్తించే విధానం చాలా తెలివిగా ఉంటుందన్నాడు.
'భారత్ గట్టి పోటీనిచ్చే జట్టు, ఆ క్రికెటర్లు తమ అవసరానికి స్లెడ్జింగ్ను బాగా ఉపయోగించుకుంటారు. కెప్టెన్ కోహ్లీ మాట్లాడే మాటలు లేదా ప్రవర్తించే విధానం చాలా తెలివిగా ఉంటుంది. వాళ్లు స్లెడ్జింగ్ను తమకు అనుకూలంగా.. తెలివిగా వినియోగించుకుంటారు. ఆ విషయంలో అందరిలానే నైపుణ్యం పొందారు. అందువల్లే నేను ఇప్పటి నుంచి ఆ జట్టుకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా' అని వేడ్ వివరించాడు.
మరోవైపు మెకాలి గాయం నుంచి కోలుకున్న మాథ్యూవేడ్.. ఈ వారం నుంచి టాస్మానియా టీమ్తో ప్రాక్టీస్ మొదలెడుతున్నట్లు చెప్పాడు. సెప్టెంబర్లో ఆస్ట్రేలియా వెళ్లే ఇంగ్లండ్ పర్యటనకు తనను ఎంపిక చేస్తారని ఆశాభావం వ్యక్తంచేశాడు. 'ఇంగ్లండ్ పర్యటనలో నేనుంటే సంతోషిస్తా. కానీ ఆల్రౌండర్ గ్లెన్మాక్స్వెల్ మళ్లీ జట్టులో కలుస్తాడని భావిస్తున్నా. ప్రస్తుత టీ20 క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్లలో మాక్స్వెల్ ఒకడు. దాంతో ఏదో ఒక సమయంలో అతడు జట్టులో కలుస్తాడు.
ఇక నా విషయానికొస్తే.. నన్ను నేను అదనపు ఆటగాడిగానే పరిగణించుకుంటా. అదనపు కీపర్, అదనపు బ్యాట్స్మన్గా భావిస్తా' అని వేడ్ పేర్కొన్నాడు. ఇదిలాఉండగా, ఈ ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియాలో నిర్వహించే టీ20 ప్రపంచకప్పై ఇంకా స్పష్టత రానప్పటికీ టీమిండియాతో మాత్రం టీ20, వన్డే, టెస్టు సిరీస్లు నిర్వహించడానికి షెడ్యూల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భారత్ , ఆస్ట్రేలియా జట్లు డిసెంబర్లో నాలుగు టెస్టులు ఆడనున్నాయి.