ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్రౌండర్ గ్లేన్ మ్యాక్స్వెల్పై ఆ జట్టు కెప్టెన్ మాథ్యూ వేడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. 100వ టీ20లో సెంచరీ బాదడం గొప్ప విషయమని కొనియాడాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్తోనే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో విజయం సాధించామని మాథ్యూ వేడ్ అభిప్రాయపడ్డాడు.
టీమిండియాతో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా మంగళవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో 1-2తో సిరీస్ రేసులో నిలిచింది. మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన మాథ్యూవేడ్.. భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో మ్యాక్స్వెల్ 30 పరుగులు ఇవ్వకుంటే సెంచరీ చేసేవాడు కాదని చమత్కరించాడు.

ఈ విజయ ఉత్సహంలోనే మరో మ్యాచ్ గెలిచి చివరి మ్యాచ్ను డిసైడర్గా మారుస్తామని తెలిపాడు. 'ఈ భారీ లక్ష్యాన్ని చేధించడం సులువైన పనికాదు. ఇదంతా మా కష్టానికి దక్కిన ప్రతిఫలం. కేన్ రిచర్డ్సన్ గాయపడటంతోనే ఆఖరి ఓవర్ గ్లేన్ మ్యాక్స్వెల్తో వేయించాల్సి వచ్చింది. బ్యాటింగ్లో మాత్రం మ్యాక్స్వెల్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.
100వ టీ20లో సెంచరీ అందుకోవడం గొప్ప విషయం. నిజాయితీగా చెప్పాలంటే ఈ మ్యాచ్ విజయం సాధిస్తామనే నమ్మకమైతే నాకు లేదు. 19 ఓవర్లలో టీమిండియా 190 పరుగులు చేయడంతో ఈ మ్యాచ్ మాదేనని భావించాను. కానీ రిచర్డ్సన్ గాయపడటం.. చివరి ఓవర్కు పేసర్లు అందుబాటులో లేకపోవడంతో మ్యాక్స్వెల్కు ఇవ్వాల్సి వచ్చింది.
ఆ ఓవర్లో 30 పరుగులు ఇవ్వకుంటే మ్యాక్సీ సెంచరీ పూర్తి చేసేవాడు కాదు. (నవ్వుతూ). కుర్రాళ్లంతా మంచి జోష్లో ఉన్నారు. ఇదే జోరులో మరో మ్యాచ్ గెలిచి చివరి మ్యాచ్ను సిరీస్ డిసైడర్గా మారుస్తాం.'అని మాథ్యూవేడ్ చెప్పుకొచ్చాడు. మ్యాక్స్వెల్ వేసిన చివరి ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ 3 సిక్స్లు, ఒక ఫోర్ సాయంతో 30 పరుగులు పిండుకున్నాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 222 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(57 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్స్లతో 123 నాటౌట్) అజేయ శతకం సాధించగా.. సూర్యకుమార్ యాదవ్(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 39), తిలక్ వర్మ(24 బంతుల్లో 4 ఫోర్లతో 31 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్సన్, జాసన్ బెహ్రెండార్ఫ్, ఆరోన్ హార్డీ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు చేసి గెలుపొందింది. గ్లేన్ మ్యాక్స్వెల్(48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్లతో 104 నాటౌట్) శతకం నమోదు చేయగా.. మాథ్యూ వేడ్(16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 28 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రవి బిష్ణోయ్(2/32) రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.