టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా తొలి సమరానికి సిద్దమైంది. గ్రూప్-ఏలో భాగంగా బుధవారం న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో జరిగే మ్యాచ్లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే బంగ్లాదేశ్తో జరిగిన సన్నాహక మ్యాచ్లో విజయం సాధించి మంచి జోష్ మీదున్న టీమిండియా.. హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది.
అయితే ప్రపంచకప్కు ఎంపికైన 15 మందిలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా టీమ్ కాంబినేషన్, ఓపెనింగ్ జోడీ, బౌలింగ్ జోడీ, స్పెషలిస్ట్ స్పిన్నర్ ఎవరా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఐపీఎల్ 2024 సీజన్లో ఆర్సీబీ ఓపెనర్గా అద్భుత ప్రదర్శన కనబర్చిన విరాట్ కోహ్లీని.. ఓపెనర్గానే ఆడించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.

ఓపెనర్గా కోహ్లీ..?
అప్పుడు కోహ్లీకి జతగా రోహిత్ ఓపెనర్గా ఆడాలా? లేక యశస్విని ఆడించాలా? అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది. ఇప్పటికే మాజీ క్రికెటర్లు టీమిండియా తుది జట్టుపై తమ అంచనాలను వెల్లడించారు. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ టీమిండియా తుది జట్టు ఎలా ఉండాలో చెప్పాడు.
విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని చెప్పిన మాథ్యూ హెడెన్.. లెఫ్టాండర్ బ్యాటర్ అయిన యశస్వి జైస్వాల్ను అతనికి తోడుగా బరిలోకి దించాలని తెలిపాడు. కోహ్లీని ఓపెనర్గా ఆడించకుంటే.. అతన్ని ప్రపంచకప్ ఆడించడం అనవసరమని మాథ్యూ హెడెన్ అభిప్రాయపడ్డాడు. ఇక ఫస్ట్ డౌన్లో సూర్యకుమార్ యాదవ్, నాలుగో స్థానంలో అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మను ఆడించాలని, ఫినిషర్లుగా రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలను బరిలోకి దించాలని చెప్పాడు.

ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్..
శివమ్ దూబేను ఆడిస్తే ఓ ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ జట్టుకు అందుబాటులో ఉంటుందని చెప్పాడు. స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ను ఆడించాలని అభిప్రాయపడిన హెడెన్.. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ను బరిలోకి దించాలని చెప్పాడు. మాథ్యూ హెడెన్ అంచనా ప్రకారం టీమిండియా బరిలోకి దిగితే సంజూ శాంసన్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్లు బెంచ్కు పరిమితం కానున్నారు.
హెడెన్ చెప్పిన జట్టే బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఓపెనర్గా కోహ్లీ కాకుండా రోహిత్ శర్మ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. పవర్ ప్లేలో అటాకింగ్ గేమ్ ఆడాలని భావిస్తున్న టీమిండియా.. ఓపెనర్గా రోహిత్ శర్మనే కరెక్ట్ అని భావిస్తోంది.
మాథ్యూ హెడెన్ భారత తుది జట్టు (అంచనా):
విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్
టీ20 వరల్డ్ కప్కు ఎంపిక చేసిన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్) సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
రిజర్వ్ ప్లేయర్లు: శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.