
న్యూఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుస పరాజయాలతో చతికిలపడిన ఆస్ట్రేలియా జట్టుకు సాయం చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని ఆ జట్టు మాజీ ప్లేయర్ మాథ్యూ హెడెన్ అన్నాడు. భారత స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే టిప్స్ తన దగ్గర ఉన్నాయని తెలిపాడు. ఇందుకోసం క్రికెట్ ఆస్ట్రేలియా తనకు ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాడు. భారత స్పిన్ వలలో చిక్కుకున్న ఆసీస్.. నాగ్పూర్ టెస్ట్లో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో.. ఢిల్లీ టెస్ట్లో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుచుకునే అవకాశాలు కోల్పోయింది. అయితే ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా నేరుగా సిరీస్ ఆడటమే ఆసీస్ కొంపముంచిందని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అన్నాడు.
వ్యూహాత్మక తప్పిదాలు కూడా జట్టు పరాజయానికి కారణమయ్యాయని చెప్పాడు. ముఖ్యంగా రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ల్లో స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడబోయి ఆరుగురు బ్యాటర్లు ఔటవ్వడాన్ని తప్పుబట్టాడు. భారత స్పిన్ పిచ్లపై స్ట్రైట్గా ఆడాలని, ఈ సిరీస్కు కామెంటేటర్గా వ్యవహరిస్తున్న మాథ్యూ హేడెన్ నుంచి తమ బ్యాటర్లు సలహాలు తీసుకోవడం మంచిదని క్లార్క్ సూచించాడు. క్లార్క్ వ్యాఖ్యలపై స్పందించిన హెడెన్.. భారత స్పిన్నర్లను ఎదుర్కోవడానికి తన సాయం కోరితే అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.
'వంద శాతం నేను సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా. పగలైనా, రాత్రైనా, ఏ సమయంలో అయినా ఎవరితోనైనా మాట్లాడేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇందుకోసం నేను క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి డబ్బులు కూడా తీసుకోను. కానీ మాజీ క్రికెటర్లతో సులభంగా మాట్లాడే అవకాశాన్ని జట్టులోని ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా కల్పించాలి'అని హేడెన్ తెలిపాడు. భారత పిచ్లపై హెడెన్కు మంచి అనుభవం ఉండటంతో పాటు రికార్డు కూడా ఉంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ మార్చి 1 నుంచి ఇండోర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే టీమిండియా.. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ ఖరారు అవుతోంది.