న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ విమర్శలు గుప్పించాడు. ఐపీఎల్ 2023 సీజన్లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2లో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. గుజరాత్ టైటాన్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమై 62 పరుగులతో చిత్తయ్యింది.
ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 8 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరుపై మాథ్యూ హెడెన్ విమర్శలు గుప్పించాడు. టీమిండియాకు అయినా.. ఐపీఎల్లో అయినా జట్టుకు అవసరమైనప్పుడు రోహిత్ శర్మ ఆడటం తాను ఇంతవరకు చూడలేదున్నాడు. పేరుకే స్టార్ బ్యాటర్ అని విమర్శించాడు.

'రోహిత్ శర్మ స్టార్ బ్యాటరే. కానీ జట్టుకు అవసరమైనప్పుడు అతను బాగా ఆడటం ఎప్పుడూ చూడలేదు. టీమిండియాకు కానీ ముంబై ఇండియన్స్ జట్టుకు కానీ అతని అవసరం ఉన్నప్పుడు దారుణంగా విఫలమయ్యాడు.'అని హెడెన్ చెప్పుకొచ్చాడు. ఇక హెడెన్ చెప్పినట్లు టీమ్కు అవసరమైనప్పుడల్లా రోహిత్ శర్మ విఫలమయ్యాడు.
2019 వన్డే ప్రపంచకప్లో ఐదు సెంచరీలతో చెలరేగిన రోహిత్.. న్యూజిలాండ్తో కీలక సెమీఫైనల్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. 2021 టీ20 ప్రపంచకప్లోనూ పాకిస్థాన్తో జరిగిన ఆరంభ మ్యాచ్లో డకౌటయ్యాడు. 2022 టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్తో చేతులెత్తేసిన రోహిత్.. ఇంగ్లండ్తో జరిగిన కీలక సెమీఫైనల్లోనూ విఫలమయ్యాడు.
ఈ రెండు టోర్నీలతో పాటు ఆసియా కప్ 2022, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ 2021లో కూడా రోహిత్ శర్మ నుంచి టీమిండియా ఆశించిన పర్ఫామెన్స్ రాలేదు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మపై మాథ్యూ హెడెన్ విమర్శలు గుప్పించాడు.
ఐపీఎల్ 2023 సీజన్ను వరుస పరాజయాలతో ప్రారంభించిన రోహిత్ సేన.. ఆ తర్వాత సంచలన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్కు దూసుకొచ్చింది. అదే జోరులో ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ను మట్టికరిపించింది. కానీ క్వాలిఫయర్-2లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ను ఓడించలేకపోయింది.