
మెల్బోర్న్: ప్రపంచ క్రికెట్లోనే మేటి జట్లయిన భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బాక్సింగ్ డే టెస్ట్కు ప్రేక్షకులు లేకుంటే బాగుండదని ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అన్నాడు. ఈ సిరీస్కు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులుండాలని... వాళ్లు లేకపోతే అది గొప్ప సిరీస్ అనిపించుకోదని వ్యాఖ్యానించాడు. ఇరుజట్ల మధ్య డిసెంబర్ 26-30 మధ్య జరిగే బాక్సింగ్ డే టెస్టును పూర్తిస్థాయి సామర్థ్యమున్న స్టేడియంలో నిర్వహిస్తేనే మజా ఉంటుందని... అలా కాకుండా ఖాళీ మైదానాల్లో నిర్వహించే ఆలోచనను విరమించుకోవాలని సూచించాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ టెస్టు వేదికను మెల్బోర్న్ నుంచి మార్చే అవకాశాలున్నాయి. మెల్బోర్న్ మైదానం ఉన్న విక్టోరియా రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దాంతో బాక్సింగ్ డే టెస్టు వేదిక మార్పు తప్పేలా లేదని క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై టేలర్ మాట్లాడుతూ 'క్రిస్మస్లాంటి సమయంలో ఇతరత్రా కారణాలతో స్టేడియంలో పది లేదా ఇరవై వేల ప్రేక్షకులతో మ్యాచ్ నిర్వహించాల్సి వస్తే అది గొప్ప సిరీస్ కానేకాదు. కరోనా అంతగా లేని పెర్త్, అడిలైడ్ ఓవల్ వేదికల్లో నిర్వహిస్తే చాలా మంది ప్రేక్షకులతో ఆట రసవత్తరంగా సాగుతుంది. పెర్త్, అడిలైడ్ మైదానాల్లో 55 వేలకంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉంది. అడిలైడ్లో అయితే భారతీయులు ఎగబడతారు. ప్రపంచకప్ (2015)లో భాగంగా భారత్, పాక్ల మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్ కోసం టికెట్లన్నీ 52 నిమిషాల్లోనే అమ్ముడైన సంగతి గుర్తుంచుకోవాలి'అని టేలర్ గుర్తు చేశాడు.