
ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో క్రీడలు వాయిదా పడ్డాయి. పలు టోర్నీల నిర్వహణపై నీలినీడలు కూడా కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెటర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ప్రకటిస్తున్నారు. ఇక శ్రీలంక పర్యటనలో తమ ఆటగాళ్లు కరచాలనం చేయరని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఇప్పటికే స్పష్టం చేశాడు. కరచాలనానికి బదులు 'ఫిస్ట్ బంప్ (పిడికిలితో పలకరింత)'తో పలకరిస్తామని రూట్ చెప్పాడు.
తాజాగా భారత్లో 43 మందికి కరోనా సోకడంతో ఇక్కడ పర్యటించినన్ని రోజులు కోహ్లీసేన సహా ఎవరితోనూ కరచాలనం చేయమని క్రికెట్ కోచ్ మార్క్ బౌచర్ తెలిపాడు. మూడు వన్డేల సిరీస్ కోసం సఫారీలు భారత్కు వచ్చిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా నుంచి బయల్దేరే ముందు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేస్తారా? అని ప్రశ్నించగా..'మేం కరచాలనం చేయాలో వద్దో ఆలోచిస్తున్నాం.
వైరస్ మా ప్లేయర్లకు సోకకుండా ఉండేందుకు కరచాలనం చేయకపోవడమే మంచిదైతే మానేస్తాం' అని బౌచర్ సమాధానం ఇచ్చాడు. వైద్య, భద్రతా సిబ్బంది అనుమతించిన తర్వాతే క్రికెట్ ఆడేందుకు వెళ్తున్నామని స్పష్టం చేశాడు.
'మాకు వైద్య సిబ్బంది ఉన్నారు. వైద్యపరంగా ఏమైనా అవసరం ఉంటే వారికి తెలియజేస్తాం. వారు సూచనలు చేస్తారు. మరీ ప్రమాదకరంగా ఉంటే వారే మమ్మల్ని వెళ్లొద్దంటారు. గత రాత్రి వైద్యసిబ్బంది మాకు వైరస్ గురించి పూర్తిగా వివరించారు. మేం వాళ్ల సూచనలు పాటిస్తాం. సిబ్బంది సరైన సహాయం చేస్తారని మాకు నమ్మకముంది' అని బౌచర్ చెప్పుకొచ్చాడు.
ఈ నెల 12, 15, 18న భారత్, సౌతాఫ్రికా మూడు వన్డేల్లో తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు ఈ సిరీస్కు టీమ్స్ను ప్రకటించాయి. గాయంతో జట్టుకు దూరమైన టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ ఈ సిరీస్తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.