
హైదరాబాద్: 'మార్చి 29' భారత క్రికెట్కు మరిచిపోలేని రోజు. యావత్ భారత అభిమానులంతా సంతోషంతో ఉప్పొంగిన రోజు. ఒకటి కాదు ఏకంగా రెండు టెస్ట్ ట్రిపుల్ సెంచరీలు నమోదైన రోజు. సరిగ్గా ఇదే రోజు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ డబుల్ ట్రిపుల్ ధమాకాతో అభిమానులను అలరించాడు.
అప్పటి వరకు ఎవరికి సాధ్యం కాదని భావించిన ఘనతను సుసాధ్యం చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్ తరపున తొలి ట్రిపుల్ సాధించిన ఆటగాడిగా.. రెండు ట్రిపుల్ సెంచరీలు బాదిన ప్లేయర్గా చరిత్రలో నిలిచిపోయాడు.
2004 పాకిస్థాన్ పర్యటనలో ముల్తాన్ వేదికగా సెహ్వాగ్ తొలి త్రిశతకం సాధించగా.. మరో నాలుగేళ్లకు సరిగ్గా ఇదే రోజు(2008, మార్చి 29) చెన్నై వేదికగా సౌతాఫ్రికాపై మరో ట్రిపుల్ సెంచరీ అందుకున్నాడు. ముల్తాన్ టెస్ట్లో మొత్తం 531 నిమిషాల పాటు క్రీజ్లో ఉన్న సెహ్వాగ్.. 375 బంతులు ఆడి 309 పరుగులు చేశాడు. ఇందులో 39 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి.
షోయబ్ అక్తర్, సక్లయిన్ ముస్తాక్, సమీ, రజాక్ వేసిన బంతులను చితకబాదుతూ.. మైదానంలో విశ్వరూపం చూపించాడు. ట్రిపుల్ సెంచరీని సిక్సర్తో సాధించడం ఈ ఇన్నింగ్స్కే హైలైట్. ఫలితంగా అప్పటి వరకు వీవీఎస్ లక్ష్మణ్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల (281) రికార్డు బద్దలయింది. సెహ్వాగ్ త్రిశతకంతో ఈ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలుపొందింది.
సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ రికార్డుగా నిలిస్తే.. ఈ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ సెంచరీ చేయకుండా అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. సచిన్ (194 నాటౌట్ ) డబుల్ సెంచరీకి దగ్గర్లో ఉండగా రాహుల్ ద్రవిడ్ మ్యాచ్ను డిక్లెర్ చేశాడు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.
సచిన్.. తన కన్న ముందు 5 డబుల్ సెంచరీలు చేస్తాడన్న అక్కసుతోనే ద్రవిడ్ డిక్లర్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. కానీ మ్యాచ్ గెలవడం కోసమే అలా చేశానని, సచిన్కు ముందే చెప్పానని ద్రవిడ్ వివరణ ఇచ్చాడు.
ఇదే విషయాన్ని సచిన్ తన బయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వే లో ప్రస్తావించాడు. ఈ వ్యవహారంలో ద్రవిడ్ తప్పులేదని, ముందే తనకు సూచించాడని స్పష్టం చేశాడు. అయితే ద్రవిడ్ కెరీర్లో మాత్రం ఈ వ్యవహారం ఓ మాయని మచ్చగా ఉండిపోయింది. సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీలను అభిమానులు నెమరువేసుకుంటున్నారు.