టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వల్లనే తన కెరీర్ నాశనమైందన్నాడు. 2011లో భారత్ తరఫున సెంచరీ చేసిన తర్వాత కూడా తనను తుది జట్టు నుంచి తప్పించారని గుర్తు చేసుకున్నాడు.
తనకు వరుసగా అవకాశాలు ఇచ్చి ఉంటే కోహ్లీ, రోహిత్లా స్టార్ ప్లేయర్ అయ్యేవాడినని అభిప్రాయపడ్డాడు. సెంచరీ తర్వాత తనను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారనే విషయంపై ధోనీని నిలదీయాలనుకుంటున్నానని తెలిపాడు. ఈ సీజన్ రంజీ ట్రోఫీ 2024లో బెంగాల్ తరఫున బిహార్తో చివరి మ్యాచ్ ఆడిన మనోజ్ తివారీ.. అన్ని రకాల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

ధోనీని నిలదీయాలని ఉంది..
బీహార్తో చివరి మ్యాచ్ ముగిసిన అనంతరం కోలకతా స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ క్లబ్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో మనోజ్ తివారీ మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. '2011లో సెంచరీ చేసిన తర్వాత కూడా నన్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారో ధోనీని అడగాలనుకుంటున్నా. రోహిత్, కోహ్లీలా స్టార్ ప్లేయర్ అయ్యే సత్తా నాకు ఉంది. కానీ అవకాశాలు లేక కాలేకపోయాను.
ఈ రోజుల్లో చాలా మంది మాజీ క్రికెటర్లకు టీవీల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఈ విషయంలోనూ నాకు బాధగా ఉంది. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను తీసుకోవడం సరికాదు. దాంతో యువ ఆటగాళ్లంతా ఐపీఎల్కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఐపీఎల్ ఆడని వారు విదేశాల్లో ఆడుతున్నారు. ఇది రంజీ ట్రోఫీ ప్రాముఖ్యతను తగ్గిస్తోంది.

రాజకీయ నాయకుల చేతిలో బీసీసీఐ..
ఈ విషయాలపై ఏదైనా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే నిషేధం లేదా జరిమానాలు విధిస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెట్టినందుకే నా మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు.
బీసీసీఐని ప్రస్తుతం రాజకీయ నాయకులు నడుపుతున్నారు. భవిష్యత్తులో కూడా బీసీసీఐ పాలన వ్యవహారాల్లో ఆటగాళ్లకు చోటు ఉండదు. రంజీ ట్రోఫీకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఈ టోర్నీ ప్రాముఖ్యత కోల్పోనుంది.'అని మనోజ్ తివారీ ఆవేదన వ్యక్తం చేశాడు.
దేశవాళీ క్రికెట్లో 19 ఏళ్ల పాటు బెంగాల్కు ప్రాతినిథ్యం వహించిన మనోజ్ తివారీ.. ఆ జట్టు తరఫున రంజీల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. భారత్ తరఫున 12 వన్డేలు, 3 టీ20 మ్యాచ్లు ఆడాడు.