
న్యూఢిల్లీ: అద్భుత ప్రదర్శన కనబర్చినా ఎందుకు పక్కన పెట్టారనీ నాటి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అడగలేకపోయానని టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారి తెలిపాడు. అప్పుడు మహీని ప్రశ్నించే ధైర్యం కూడా తనకు లేదన్నాడు. 2007లో భారత జట్టు సారథ్య బాధ్యతలు అందుకున్న ధోనీ.. 2011 ప్రపంచకప్ లక్ష్యంగా జట్టును సిద్దం చేసుకున్నాడు.
ఈ క్రమంలో సీనియర్ క్రికెటర్లని సైతం పక్కనపెట్టిన ధోనీ.. జట్టులో సమతూకం తెచ్చేందుకు ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాడు. దీంతో ప్రగ్నాన్ ఓజా, ఆర్పీ సింగ్, మనోజ్ తివారి తదితర క్రికెటర్లు వేటుకి గురయ్యారు. తమపై ఎందుకు వేటు వేసారని అప్పట్లో కెప్టెన్ ధోనీని ప్రశ్నించే సాహసం ఎవరూ చేయలేకపోయామని తాజాగా మనోజ్ తివారి చెప్పుకొచ్చాడు.
భారత్ తరఫున 12 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లాడిన మనోజ్ తివారి.. 2011లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ సాధించాడు. కానీ.. ఆ తర్వాత ఏడాది వరకూ మళ్లీ అతనికి వన్డేలు ఆడే అవకాశం దక్కలేదు. ఎంతలా అంటే.. సెంచరీ తర్వాత ఏకంగా 14 మ్యాచ్ల్లో అతను రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యాడు. కానీ.. ఎప్పుడూ ధోనీని తనకి అవకాశం ఇవ్వకపోవడంపై ప్రశ్నించలేదని మనోజ్ తివారి చెప్పుకొచ్చాడు.
'వెస్టిండీస్పై సెంచరీ చేయడంతో నాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కానీ ఆ తర్వాత 14 మ్యాచ్ల్లోనూ నాకు తుది జట్టులో అవకాశం లభించలేదు. అయినప్పటికీ నేను అప్పటి కెప్టెన్ ధోనీని ప్రశ్నించలేదు. కెప్టెన్, కోచ్, టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయాల్ని అప్పుడు గౌరవించేలానే ఆలోచనతో అడగలేకపోయా. ఆ మ్యాచ్లకు టీమ్ సమతూకం అలా ఉండాలని వారు నిర్ణయించారు. నాపై వేటు గురించి ధోనీని అడిగే అవకాశం దక్కలేదు.. ఆ సమయంలో ఆ ధైర్యం కూడా లేదు'' అని మనోజ్ తివారి పేర్కొన్నాడు.