టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సరిగ్గా కోచింగ్ ఇవ్వకుండా ఆటగాళ్లను నిందించడం ఏంటని ప్రశ్నించాడు. ఇంకొన్నాళ్లు టెస్ట్ క్రికెట్ ఆడాలని భావించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను రిటైర్మెంట్ తీసుకునేలా గంభీర్ ఒత్తిడి చేశాడని, ఆ తప్పిదమే ఇప్పుడు వెంటాడుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
సౌతాఫ్రికాతో కోల్కతా వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. పూర్తిగా స్పిన్కు అనుకూలంగా ఉన్న పిచ్పై 124 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించలేకపోయింది. అయితే ఈ పిచ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇంత ఏకపక్షంగా టర్నింగ్ ట్రాక్ను ఎందుకు సిద్దం చేశారని క్యురేటర్పై మాజీ క్రికెటర్లు మండిపడ్డారు.

తాము కోరడంతోనే టర్నింగ్ ట్రాక్ సిద్దం చేశారని, క్యురేటర్ తప్పులేదని మ్యాచ్ అనంతరం గంభీర్ స్పష్టం చేశాడు. సమస్య టర్నింగ్ ట్రాక్ది కాదని, తమ బ్యాటర్లు సరిగ్గా ఆడలేకపోయారని చెప్పాడు. ఓపికగా డిఫెన్స్ ఆడి ఉంటే ఈజీగా లక్ష్యాన్ని ఛేదించేవారని అభిప్రాయపడ్డాడు. ఈ వ్యాఖ్యలపై మనోజ్ తివారీ మండిపడ్డాడు. చేసుకున్న పాపం ఎక్కడికీ పోదని, కోచ్గా గంభీర్ విఫలమయ్యాడని విమర్శలు గుప్పించాడు.
'భారత క్రికెట్లో ట్రాన్సిషన్ ఫేజ్కు చోటు లేదు. అసలు భారత జట్టుకు ఈ అవసరమే లేదు. న్యూజిలాండ్, జింబాబ్వే వంటి దేశాలకు ఈ ట్రాన్సిషన్ ఫేజ్ అవసరం. మన దేశవాళీ క్రికెట్లో ఎంతో మంది ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉననారు. సత్తా చాటేందుకు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇంకొంత కాల టెస్ట్ క్రికెట్ ఆడాలని భావించారు. కానీ ట్రాన్సిషన్ ఫేజ్ అంటూ వారిపై అనవసర ఒత్తిడి తీసుకొచ్చాడు. దాంతో వారు టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికారు.
సౌతాఫ్రికాలో తొలి టెస్ట్ ఓటమికి బ్యాటర్లను బాధ్యులను చేయడం సరికాదు. ఓటమి తర్వాత బ్యాటర్ల టెక్నిక్ను తప్పుబట్టడం సరికాదు. కోచ్గా సరైన టెక్నిక్ నేర్చించడం గంభీర్ బాధ్యత. బ్యాటర్లు సరిగ్గా డిఫెన్స్ ఆడలేదని అంటున్నారు. మ్యాచ్కు ముందు సరైన ట్రైనింగ్ ఇవ్వలేదని నేను అంటున్నా. గంభీర్ ఆటగాడిగా ఉన్నప్పుడు స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఆడేవాడు. అతను కోచ్గా మరింత మెరుగ్గా పనిచేయాలి.'అని మనోజ్ తివారీ సూచించాడు. శనివారం నుంచి గౌహతి వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.