టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించడం తీవ్ర చర్చనీయాంశమైంది. వన్డే ప్రపంచకప్ 2027ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని భారత సెలెక్షన్ కమిటీ వివరణ ఇచ్చినా.. అభిమానులు సంతృప్తి చెందడం లేదు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచనలతోనే కెప్టెన్సీ మార్పు జరిగిందని మాజీ క్రికెటర్లు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. జట్టులో గంభీర్ నిర్ణయాలను ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే రోహిత్ శర్మ, అశ్విన్, విరాట్ కోహ్లీలను జట్టు నుంచి తప్పించాడని తెలిపాడు.

'సీనియర్ ఆటగాళ్లు అశ్విన్, రోహిత్, విరాట్ కోహ్లీ జట్టులో ఉంటే హెడ్ కోచ్గా గంభీర్ నిర్ణయాలు నచ్చకపోతే నిలదీస్తారు. ఎందుకంటే ఈ ముగ్గురు చాలా కాలం క్రికెట్ ఆడారు. హెడ్ కోచ్, సపోర్ట్ స్టాఫ్ కంటే ఎక్కువ జట్టులో సెట్ అయ్యారు. గంభీర్ విషయంలో ఏదైనా పాయింట్ నచ్చకపోతే నిర్మోహమాటంగా అడుగుతారు. అందుకే ఈ ముగ్గురు జట్టులో లేకుండా గంభీర్ చూసుకున్నాడు.
గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాల వివాదాలు తలెత్తుతాయని భావించాను. ప్రస్తుతం జరుగుతున్న చాలా విషయాలు భారత క్రికెట్కు మంచివి కావు. ఆయన హెడ్ కోచ్గా వచ్చిన తర్వాతే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.రోహిత్, విరాట్లు అదే పని చేశారు. ఏ మాత్రం ఊహించని ఆటగాళ్లు జట్టులోకి రావడం, తుది జట్టులో ఆడించడం వంటి విషయాలు కూడా జరిగాయి. ఇవన్నీ గంభీర్ స్థిరంగా లేడనే విషయాన్ని సూచిస్తున్నాయి.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత క్రికెట్కు ఎంతో చేశారు. కఠిన పరిస్థితుల్లో అద్భుతమైన ప్రదర్శనతో జట్టును నిలబెట్టారు. భారత జట్టును కొత్త శిఖరాలకు చేర్చారు. జట్టు కోసం తమ సర్వస్వం ధారపోసారు. అలాంటి ఆటగాళ్లు తమ ప్రతిష్టకు భంగం కలుగుతోందని భావించే గౌరవంగా జట్టు నుంచి తప్పుకున్నారు. నాకు తెలిసి వారికి ఇంకొంత కాలం క్రికెట్ ఆడాలని ఉంది. వైట్బాల్ క్రికెట్లో ఈ ఇద్దరు గొప్పగా రాణించారు.
వారి గణంకాలు చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది. అయితే వన్డే ప్రపంచకప్ 2027 ప్రణాళికల నుంచి గౌతమ్ గంభీర్ ఈ ఇద్దర్నీ తప్పిస్తాడని అనుకుంటున్నా. ఒకవేళ ఇలా చేస్తే మాత్రం అత్యంత చెత్త నిర్ణయంగా ఇది మిగిలిపోతుంది.'అని మనోజ్ తివారి చెప్పుకొచ్చాడు.