గత కొన్నేళ్లుగా క్రికెట్ను ఏలుతున్న ఆస్ట్రేలియాలో చాలా మందికి తమ క్రికెటర్లు ఎవరో తెలియదు. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2024ను ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా.. భారత్ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది.
ఈ విజయంలో కెప్టెన్గా ప్యాట్ కమిన్స్, స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్ల్లో ట్రావిస్ హెడ్ దుమ్మురేపాడు. భారత్లో ఈ ఇద్దరూ తెలియని క్రికెట్ అభిమాని ఎవరూ ఉండరు. కానీ ఆస్ట్రేలియాలో ఈ ఇద్దరు ఎవరో కూడా చాలా మందికి తెలియదు.

తాజాగా ఆ దేశానికి ఓ యూట్యూబర్ తమ దేశ పౌరులను ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ తెలుసా? అని ప్రశ్నించగా.. అందరూ తెలియదనే చెప్పారు. ఈ ఇద్దరి కంటే విరాట్ కోహ్లీ తెలుసని చెప్పడం గమనార్హం. ఒకరు క్రికెట్లో తనకు బ్రెట్లీ మాత్రమె తెలుసని చెప్పగా.. మరో ప్రవాస భారతీయుడు కోహ్లీ తెలుసన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. భారత నెటిజన్లు అవాక్కవుతున్నారు.
ఇందుకేనేమో వన్డే ప్రపంచకప్ 2023 గెలిచిన తర్వాత స్వదేశానికి వెళ్లిన ఆస్ట్రేలియాకు ఘన స్వాగతం లభించలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇది ప్రపంచకప్ హీరోలకు అవమానమని పేర్కొంటున్నారు. క్రికెట్లో అత్యధికసార్లు ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియాలో ఆ దేశ ప్రజలు ఈ ఆటను పట్టించుకోవడం లేదని, భారతీయులు మాత్రం నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నారని కామెంట్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియాలో క్రికెట్తో పాటు ఇతర క్రీడలకు కూడా ఆదరణ ఉంటుందని, అయితే జనాలు తమ పనుల కంటే మరే విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరని అభిప్రాయపడుతున్నారు. ఆటను ఆటలా మాత్రమే చూస్తారని, భారత్లోలా ఎమోషనల్ అవ్వరని కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి ఏ ఆటగాడిని, ఆటను నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు.
భారత్లో చాలా మంది సినిమా, క్రికెట్ పిచ్చితో తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని కామెంట్ చేస్తున్నారు.