న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ ముందు సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ మఖయా ఎన్తిని బౌలర్లకు కీలక సూచన చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని స్లెడ్జింగ్ పేరిట గెలుకొద్దని సూచించాడు. విరాట్ కోహ్లీని గెలికితే విధ్వంసం సృష్టిస్తాడని, ఈ విషయంలో బౌలర్లంతా జాగ్రత్తగా ఉండాలని తెలిపాడు.ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ.. విరాట్ కోహ్లీని మాత్రం రెచ్చగొట్టద్దని సూచించాడు.
వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఓ చానెల్తో మాట్లాడిన ఎన్తిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేసేటప్పుడు బౌలర్లు తమ పని మీదనే ఫోకస్ పెట్టాలన్నాడు. 'ప్రపంచకప్లో విరాట్ కోహ్లీని అస్సలు స్లెడ్జింగ్ చేయవద్దు. ఎంతటి బౌలర్ అయినా సరే కోహ్లీని స్లెడ్జింగ్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

ఏమీ అనకుండా ఉంటే.. అతనే విసుగుగా భావిస్తాడు. అప్పుడు ఔట్ చేసేందుకు బౌలర్లకు అవకాశం లభిస్తుంది. విరాట్ కోహ్లీ గురించి మా బౌలర్లకు చెప్పేదొక్కటే.. అతను బ్యాటింగ్ చేసేటప్పుడు ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడవద్దు. మళ్లీ మళ్లీ చెబుతున్నా స్లెడ్జింగ్ అస్సలు చేయవద్దు. అలా చేస్తే మాత్రం అతని చేతుల్లో ఘోర పరాభవం తప్పదు.
అతనికి ఇలాంటి పోటీ అంటే చాలా ఇష్టం. ఇలా చేస్తే మాత్రం విరాట్ కోహ్లీ ఏం కావాలని కోరుకున్నాడో అదే జరుగుతుంది. ఒకవేళ ఎవరూ విరాట్ను ఏమీ అనకుండా ఉంటే విసిగిపోయి పొరపాట్లు చేస్తాడు. అప్పుడు అతన్ని ఔట్ చేసే అవకాశాలు లభిస్తాయి. అందుకే, విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయాల్సి వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించాలి.'అని ఎన్తిని సూచించాడు.

ఇక భారత్తో పాటు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సెమీస్ చేరుతాయని ఎన్తిని జోస్యం చెప్పాడు. 'భారత్తోపాటు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సెమీస్కు చేరతాయి. ఈసారి సౌతాఫ్రికా టైటిల్ గెలుస్తుందని భావిస్తున్నా. మా జట్టులో డికాక్, బవుమా, డేవిడ్ మిల్లర్ కీలక పాత్ర పోషిస్తారు.
రబాడ, నోకియా, ఎంగిడి వంటి టాప్ పేసర్లు సౌతాఫ్రికా సొంతం. అందుకే, ఈ వరల్డ్ కప్లో మా జట్టు సెమీస్కు చేరుతుందని చెబుతున్నా. ఐపీఎల్లో అన్రిచ్ నోకియాకు అద్భుతమైన రికార్డు ఉంది. భారత్లోని పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండటం కలిసొస్తుంది'అని ఎన్తిని చెప్పుకొచ్చాడు. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.