
న్యూఢిల్లీ: కెరీర్లో తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన, ది బెస్ట్ ఫాస్ట్ బౌలర్ పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్ అని శ్రీలంక మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే అన్నాడు. అతనితో మ్యాచ్ అంటేనే పీడకలలా ఉండేదని, చూడగానే ప్యాంట్ తడిసిపోయేదని చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే జయవర్దనే అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఇక శ్రీలంక- పాకిస్థాన్ తలపడిన ప్రతిసారి వసీం బౌలింగ్ అంటే తాను భయపడేవాడినంటూ జయవర్ధనే తాజాగా చెప్పుకొచ్చాడు. ఐసీసీ డిజిటల్ షోలో 'నీవు ఎదుర్కొన్న ఉత్తమమైన పేసర్ ఎవరు?'అని ప్రశ్నకు వసీమ్ అక్రమ్ అని బదులిచ్చాడు.
'నేను ఎదుర్కొన్న కఠిన బౌలర్ వసీం అక్రమ్. అతని కెరీర్ పీక్లో ఉన్నపుడే నేను అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాను. తన చేతిలో కొత్త బంతి ఉందంటే అంతే ఇక! అతన్ని ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్న పని. నిజంగా పీడకలలా అనిపించేది. వసీం బౌలింగ్ యాక్షన్ బాగుంటుంది. బ్యాటర్ను ఇబ్బంది పెట్టడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఫార్మాట్ ఏదైనా సరే అతను ప్రత్యర్థులపై చెలాయించే ఆధిపత్యం మాములుగా ఉండదు. ఆట మొదలుపెట్టినప్పటి బంతి నుంచి చివరి బంతి వరకూ అతడు ఒకే రకమైన వేగంతో బంతులు విసిరేవాడు.. నేను ఎదుర్కున్న బౌలర్లలో అత్యుత్తమ బౌలర్ అతడే.' అని చెప్పుకొచ్చాడు.
వసీం అక్రమ్ తన కెరీర్ లో 916 వికెట్లు పడగొట్టాడు. 104 టెస్టులాడిన అక్రమ్.. 414 వికెట్లు తీశాడు. ఇక 356 వన్డేలు ఆడిన అతను.. ఏకంగా 502 వికెట్లు తీశాడు. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తన రికార్డును బద్దలు కొట్టేదాకా వన్డేలలో అక్రమ్ లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. మురళీధరన్ తన కెరీర్ లో 1,334 వికెట్లు తీశాడు. 133 టెస్టులలో 800 వికెట్లు, 350 వన్డేలలో 534 వికెట్లతో ఎవరికీ అందనంత దూరంలో నిలిచాడు.