ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో తమ అభిమానులకు ముంబై ఇండియన్స్ వరుస షాక్లిస్తోంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను క్యాష్ ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తెచ్చుకున్న ముంబై ఇండియన్స్.. తాజాగా టీమ్ సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించింది. ఐదు సార్లు ఛాంపియన్గా నిలబెట్టిన రోహిత్ శర్మ కెప్టెన్సీపై వేటు వేసి హార్దిక్ పాండ్యాను నూతన సారథిగా ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ముంబై ఇండియన్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది.
హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ భవిష్యత్తు కోసమే తీసుకున్నారని, టీమ్ సారథ్య బాధ్యతలను అతనికే ఇస్తారని అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులు ముందే పసిగట్టారు. కానీ ఈ మార్పు ఇంత త్వరగా ఉంటుందని ఊహించలేకపోయారు. కనీసం అప్కమింగ్ సీజన్లోనైనా రోహిత్ శర్మ జట్టును నడిపిస్తాడని భావించారు. కానీ ముంబై ఇండియన్స్ సారథిగా రోహిత్ శర్మను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దాంతో ముంబై ఇండియన్స్లో ఓ శకం ముగిసింది.

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ మహేళా జయవర్దనే తెలిపాడు.
'భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ముంబై ఇండియన్స్ నిర్ణయాలు తీసుకుంటోంది. కెప్టెన్సీ మార్పు కూడా అందులో భాగమే. రోహిత్ శర్మతో పాటు గతంలో సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్, రికీ పాంటింగ్లు ముంబై ఇండియన్స్ను అద్భుతంగా నడిపించడంతో పాటు ముందు చూపుతోనూ వ్యవహరించారు. వచ్చే సీజన్ నుంచి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేపడతాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై జట్టు అత్యుత్తమ ఫలితాలు సాధించింది. అతని సారథ్య పటిమకు మా అభినందనలు.
ఐపీఎల్లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన రోహిత్ శర్మ అనుభవం మైదానంలోనూ.. ఆఫ్ ఫీల్డ్లోనూ జట్టుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.'అని జయవర్దనే చెప్పుకొచ్చాడు.

అనూహ్యంగా ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ.. జట్టుకు తొలి టైటిల్ అందించడంతో పాటు మొత్తం ఐదు సార్లు ఛాంపియన్గా నిలబెట్టాడు. 2013లో తొలి 6 మ్యాచ్ల్లో ముంబైకి సారథిగా వ్యవహరించిన రికీ పాంటింగ్ అనూహ్యంగా తప్పుకోవడంతో ఏడో మ్యాచ్ నుంచి రోహిత్ జట్టును నడిపించాడు. అదే సీజన్లో ముంబైకి తొలి టైటిల్ అందించాడు. ఆ తర్వాత 2015, 2017,2019,2020 సీజన్లలో ముంబైని ఛాంపియన్గా నిలబెట్టాడు.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ 158 మ్యాచ్ల్లో 87 విజయాలతో పాటు 67 పరాజయాలు నమోదు చేసింది. 4 మ్యాచ్లు ఫలితం తేలలేదు. 2021, 2022లో ముంబై దారుణంగా విఫలం కాగా.. ఐపీఎల్ 2023 సీజన్లో మాత్రం ప్లే ఆఫ్స్ చేరింది.