
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టు సక్సెస్ సీక్రేట్ను ఆ జట్టు కోచ్, శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్దనే తెలిపాడు. తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. జట్టులోని ప్రతీ ఒక్కరిని భాగస్వామ్యం చేయడంతోనే ముంబైకి విజయాలు దక్కుతున్నాయని చెప్పుకొచ్చాడు.
ఇక ఆటగాళ్ల మధ్య ఉండే అహంకారాలను అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా.. 'ఈ స్థాయిలో ఆడేందుకు ఎంపికయ్యారంటేనే వాళ్లు మంచి ఆటగాళ్లనడంలో సందేహం లేదు. అయితే దానిని నిరూపించుకునేందుకు వారికి అవకాశం కల్పించాలి. అంతే. మిగిలినది దానంతట అదే జరిగిపోతుంది'అన్నారు.

జట్టులోని సభ్యులందరితో మర్యాదగా, ప్రోఫెషనల్గా వ్యవహరిస్తానని, జట్టులో మంచి వాతావరణం నెలకొనడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఒకసారి ఆటగాళ్లు ఈ వాతావరణానికి అలవాటు పడితే వారు గీత దాటే అవకాశం ఉండదని, ఒకవేళ దాటినా మిగతా ఆటగాళ్లు అతడిని దారిలోకి తీసుకొస్తారని చెప్పారు. ఇలాంటి వాతావరణం లేకపోతే జట్టులో అనేక సమస్యలు వస్తాయని, ఆటగాళ్ల ఆటతీరుపైనా ప్రభావం పడుతుందని తెలిపారు.
అంతేకాకుండా క్రికెట్లో తనకు, ఆటగాళ్లకు ఉన్న అనుభవం కూడా జట్టును ముందుకు నడిపించేందుకు ఎంతగానో ఉపయోగపడుతోందని జయవర్దనే చెప్పుకొచ్చారు. రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఇప్పటికే నాలుగు టైటిళ్లను గెలుచుకున్న విషయం తెలిసిందే.