టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఇవ్వాలని మాజీ క్రికెటర్ మదన్ లాల్ అభిప్రాయపడ్డారు. సుదీర్ఘ ఫార్మాట్లో భారత జట్టును నడిపించే సత్తా అతనికే ఉందని, రోహిత్ శర్మ స్థానాన్ని అతను మాత్రమే భర్తీ చేయగలడని చెప్పాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతానని హిట్ మ్యాన్ తెలిపాడు.
ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో సెలెక్టర్ల సూచనల మేరకే అతను వీడ్కోలు పలికి ఉంటాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ను స్వాగతించిన మదన్లాల్.. తదుపరి కెప్టెన్గా బుమ్రానే నియమించాలని సూచించారు. వైస్ కెప్టెన్గా కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలని చెప్పారు.

'టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రాకు అవకాశం ఇవ్వాలి. అతనే సరైనోడు. ఫిట్నెస్ అనేది భిన్నమైన అంశం. బుమ్రా ఫిట్గా ఉండి అందుబాటులో ఉంటే మాత్రం టెస్ట్ కెప్టెన్సీకి అతనే సరైనోడు. వైస్ కెప్టెన్గా యువ ఆటగాళ్లను నియమించవచ్చు.'అని మదన్ లాల్ చెప్పుకొచ్చారు.
రోహిత్ శర్మ రిటైర్మెంట్ నిర్ణయాన్ని మదన్ లాల్ సమర్థించారు. పెద్ద ఆటగాళ్లు జట్టులోకి వచ్చినప్పుడు, వారికి మొదటి ప్రాధాన్యత లభిస్తుందని, అయితే ఫామ్ ఎప్పుడైనా మారవచ్చని ఆయన అన్నారు. రోహిత్ తన నిర్ణయం గురించి బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని అభిప్రాయపడ్డారు.
జస్ప్రీత్ బుమ్రా ఇప్పటి వరకు మూడు టెస్టుల్లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. అందులో భారత్ ఒకటి గెలిచి మరో రెండింటిలో ఓడింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా సారథ్యంలోనే టీమిండియా శుభారంభం చేసింది. అయితే ఈ సిరీస్లో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి బౌలింగ్ చేయడం వల్ల ఆఖరి మ్యాచ్లో బుమ్రా వెన్ను గాయానికి గురయ్యాడు. ఈ గాయంతో సుదీర్ఘ కాలం జట్టుకు దూరంగా ఉన్నాడు.
ఈ గాయాల బెడదతోనే బుమ్రాను లీడర్షిప్ గ్రూప్ నుంచి తప్పించాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో బుమ్రా ఐదు మ్యాచ్లకు ఐదు ఆడలేని పరిస్థితి నెలకొంది. జూన్ 20 నుంచి టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటన మొదలవ్వనుంది.